Sunday, October 6, 2024
HomeUncategorizedజులై 22 నుంచి పార్లమెంట్ సమావేశాలు

జులై 22 నుంచి పార్లమెంట్ సమావేశాలు

Date:

నరేంద్రమోడీ నేతృత్వంలో మూడోసారి కొలువైన కొత్త ప్రభుత్వం జులై 23న బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికిగానూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించనున్నారు. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో జులై 22 నుంచి ఆగస్టు 12 వరకు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని తెలిపారు.

ఎన్నికల సంవత్సరం కావడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 1న నిర్మలమ్మ ఓటాన్‌ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో పూర్తి స్థాయి బడ్జెట్‌ను తీసుకొస్తున్నారు. మోదీ 3.0లో ప్రవేశపెట్టనున్న తొలి బడ్జెట్‌ ఇదే. దీంతో వరసగా ఏడుసార్లు బడ్జెట్‌ సమర్పించిన ఘనతను నిర్మలా సీతారామన్‌ అందుకోనున్నారు. ఇప్పటి వరకు మొరార్జీ దేశాయ్‌ వరసగా ఆరుసార్లు బడ్జెట్‌ సమర్పించారు. 2019లో రెండోసారి మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీతారామన్‌కు ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించారు.