రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర పశ్చిమ బెంగాల్లో సాగుతుంది. పశ్చిమ బెంగాల్లో జరుగుతోన్న భారత్ జోడో న్యాయ యాత్రలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కారు అద్దం ధ్వంసమైంది. ఒకేసారి వేలాదిమంది మద్దతుదారులు గుమిగూడటంతో ఈ ఘటన జరిగింది. దీనిపై కాంగ్రెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
‘ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ర్యాలీలో పోలీసులందరూ బిజీగా ఉన్నారు. మా వద్ద అతి కొద్దిమంది సిబ్బంది మాత్రమే భద్రతా ఏర్పాట్లు చూస్తున్నారు’ అని హస్తం పార్టీ ఆరోపించింది. ఈ ఘటనను భద్రతా వైఫల్యంగా పేర్కొంది. అయితే ఆ సమయంలో రాహుల్ ఆ కారులో లేరు. బిహార్ నుంచి బుధవారం మరోసారి పశ్చిమ బెంగాల్లోని మాల్డాలోకి యాత్ర ప్రవేశించింది. ఆ సమయంలోనే కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాహుల్ కాన్వాయ్పై రాళ్లు వేశారని ఆ పార్టీ నేత అధిర్ రంజన్ చౌదరి ఆరోపించారు. ఇదిలా ఉంటే.. లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ్ బెంగాల్లో కాంగ్రెస్తో పొత్తు ఉండదని మమత ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ ఘటనపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. రాహుల్ గాంధీ కారుపై బిహార్లో దాడి జరిగిందని, తమ రాష్ట్రంలో కాదని అన్నారు. ‘రాహుల్ కారుపై రాళ్ల దాడి జరిగిందని నాకు సమాచారం అందింది. వాస్తవంగా అసలు ఏం జరిగిందనేది నేను తెలుసుకున్నా. ఆ ఘటన బెంగాల్లో కాదు.. బిహార్లో చోటుచేసుకుంది. ధ్వంసమైన అద్దంతో ఆ కారు మా రాష్ట్రంలోకి ప్రవేశించింది. ఇదంతా ఓ డ్రామా’ అని వ్యాఖ్యలు చేశారు.