ఉపాధికోసం ఎదురు చూసే నిరుద్యోగులకు ఇదొక మంచి అవకాశం. 8, 10వ తరగతితో పాటు ఐటీఐ పాసైన అభ్యర్థులకు ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మజగావ్ డాక్ షిప్బిల్డర్స్ లిమిటెడ్ (MDL), ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. గ్రూప్ A, గ్రూప్ B, గ్రూప్ C పోస్టుల్లో అప్రెంటిస్గా చేరడానికి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్లో మొత్తం 518 పోస్టులను భర్తీ చేయనున్నారు. 8, 10వ తరగతితో పాటు ఐటీఐ పాసైన అభ్యర్థులు ఈ అప్రెంటిస్షిప్ పోస్టులకు అర్హులు. ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేయడానికి చదువు మధ్యలో ఆపేసిన వారికి, గ్యాప్ ఉన్నవారికి ఇది మంచి అవకాశం. ఈ పోస్టులకు అప్లికేషన్ ప్రాసెస్, దరఖాస్తుకు చివరి గడువు, సెలక్షన్ ప్రాసెస్, జీతభత్యాలు, తదితర విషయాలు తెలుసుకుందాం.
- ఖాళీలు
రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న మినీ రత్న కంపెనీల్లో ఎండీఎల్ ఒకటి. గ్రూప్ A కింద ఈ సంస్థ 218 ఖాళీలను భర్తీ చేయనుంది. గ్రూప్ Bలో 240 వేకెన్సీస్ ఉన్నాయి. గ్రూప్ Cలో మొత్తం 60 పోస్టులు ఉన్నాయి.
- అప్లికేషన్ ప్రాసెస్
- అప్రెంటిస్షిప్ పోస్టులకు అప్లికేషన్ ప్రాసెస్ పూర్తిగా ఆన్లైన్లో ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు MDL వెబ్సైట్ https://mazagondock.in ఓపెన్ చేయాలి.
- తర్వాత కెరీర్స్ సెక్షన్కు వెళ్లి, ‘ఆన్లైన్ రిక్రూట్మెంట్’, ఆ తర్వాత ‘అప్రెంటీస్’ ఆప్షన్స్ క్లిక్ చేయండి.
- అప్రెంటీస్ సెక్షన్లో అకౌంట్ క్రియేట్ చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేయండి.
- తర్వాత అకౌంట్కు లాగిన్ అయ్యి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు నోటిఫికేషన్లో సూచించిన ప్రాసెస్ ఫాలో అవ్వాలి.
- సెలక్షన్ ఎలా?
అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నారు. పోస్టులు, విద్యార్హతలను బట్టి క్యాండిడేట్లకు రాత పరీక్ష ఉంటుంది. నోటిఫికేషన్ ప్రకారం.. ఈ ఏడాది ఆగస్టు 10న రాత పరీక్ష జరగనుంది. సిలబస్ కోసం వెబ్సైట్ చెక్ చేయవచ్చు.
- ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్
పదో తరగతి పాసైన వారు గ్రూప్ A పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఐటీఐ పూర్తి చేసిన వారు గ్రూప్ B, 8వ తరగతి పాసైన వారు గ్రూప్ C పోస్టుల కోసం పోటీపడొచ్చు. గ్రూప్ A పోస్టులకు సంబంధించి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు పదో తరగతిలో మ్యాథమెటిక్స్, సైన్స్ సబ్జెక్టులలో కనీసం 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు పాసైతే చాలు.
గ్రూప్ B పోస్టులకు దరఖాస్తు చేయాలంటే జనరల్ కేటగిరీ అభ్యర్థులకు ఐటీఐలో కనీసం 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు పాసైతే సరిపోతుంది. గ్రూప్ C అప్రెంటిస్షిప్కి అప్లై చేసేవారికి కూడా ఇదే రూల్ వర్తిస్తుంది. 8వ తరగతిలో జనరల్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులు పొందాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కనీస మార్కుల నిబంధన లేదు.
- స్టైపెండ్ ఎంత?
గ్రూప్ A అప్రెంటిస్ వ్యవధి రెండేళ్లు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి మొదటి 3 నెలల వరకు నెలకు రూ.3,000 స్టైపెండ్ అందుతుంది. ఆ తర్వాత నెలకు రూ.6 వేలు పొందవచ్చు. ఇక ఏడాది పాటు గ్రూప్ B అప్రెంటిస్లకు ట్రైనింగ్ ఉంటుంది. వీరికి నెలకు రూ.8,050 ఇస్తారు. పైప్ ఫిట్టర్, వెల్డర్, కోపా, కార్పెంటర్లకు నెలకు రూ.7,700 స్టైపెండ్ అందుతుంది. ఇక గ్రూప్ C అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ రెండేళ్ల పాటు ఉంటుంది. ఎంపికైన వారికి మొదటి మూడు నెలలు రూ.2,500 వస్తుంది. ఆ తర్వాత 9 నెలలు రూ.5,000; రెండో ఏడాదిలో నెలకు రూ.5,500 పొందవచ్చు.