Saturday, October 5, 2024
HomeUncategorizedఎంపీగా ప్రమాణం చేసిన నరేంద్ర మోడీ

ఎంపీగా ప్రమాణం చేసిన నరేంద్ర మోడీ

Date:

దేశంలో 18వ లోక్‌సభ తొలి సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మహతాబ్‌ సభ్యులతో ప్రమాణస్వీకార కార్యక్రమం చేపట్టారు. లోక్‌సభాపక్ష నేతగా ప్రధాని మోడీ తొలుత ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయన పోడియం వద్దకు రాగానే ఎన్డీయే కూటమి సభ్యులంతా మోదీ, మోదీ అంటూ నినాదాలు చేశారు. అనంతరం కేంద్రమంత్రులు, ఇతర సభ్యులతో ప్రొటెం స్పీకర్‌ లోక్‌సభ సభ్యులుగా ప్రమాణం చేయిస్తున్నారు. తొలి రోజు 280 మంది ఎంపీలు ప్రమాణం చేయనున్నారు. మిగిలిన వారితో మంగళవారం ప్రమాణస్వీకారం చేయిస్తారు. అనంతరం స్పీకర్‌ ఎన్నికకు నామినేషన్‌ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 26న స్పీకర్‌ ఎన్నిక పూర్తవుతుంది. 27న రాజ్యసభ కూడా ప్రారంభం కానుంది. అదే రోజు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించనున్నారు.

విపక్ష ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంటు సముదాయంలోని పాత భవనం వద్ద కలుసుకుని, అక్కడి నుంచి నూతన భవనం వరకు ర్యాలీగా వచ్చారు. మొన్నటివరకు మహాత్మాగాంధీ విగ్రహం ఉన్న ప్రాంతంలో రాజ్యాంగం చిరు ప్రతులను చేతపట్టుకుని కొంతసేపు నిరసన చేపట్టారు. అనంతరం వీరంతా ఒకేసారి లోక్‌సభకు వెళ్లారు. సభ ప్రారంభం కాగానే కేరళలోని వయనాడ్‌ స్థానానికి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేసిన రాజీనామాను స్పీకర్‌ ఆమోదించారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ రాహుల్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అనంతరం వయనాడ్‌ను వదులకుని రాయ్‌బరేలీ ఎంపీగా కొనసాగాలని ఆయన నిర్ణయించుకున్నారు.