ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ఈ అంశంపై హైకోర్టు నిర్ణయం వెలువడ్డాకే తమ తీర్పు ఉంటుందని.. అప్పటివరకు వేచి ఉండాలని న్యాయస్థానం సూచించింది. ఒకవేళ ఆదేశాలు ఇస్తే అది ముందస్తు తీర్పే అవుతుందని అభిప్రాయపడింది. దీంతో కేజ్రీవాల్ ప్రస్తుతానికి తీహార్ జైలుకే పరిమితం కావాల్సి ఉంటుంది. మద్యం కుంభకోణం కేసులో ట్రయల్ కోర్టు తనకు ఇచ్చిన బెయిల్పై ఢిల్లీ హైకోర్టు మధ్యంతర స్టే ఇవ్వడాన్ని సవాలు చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టీలతో కూడిన వెకేషన్ బెంచ్ విచారించింది. కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, విక్రమ్చౌధరీలు హాజరుకాగా.. ఈడీ తరఫున అడిషినల్ సొలిసిటర్ జనరల్ రాజు వాదనలు వినిపించారు.
ట్రయల్ కోర్టు బెయిల్ ఆర్డర్ చూడకముందే హైకోర్టు స్టే ఇవ్వగలిగినప్పుడు.. మీరెందుకు (సుప్రీం ధర్మాసనం) హైకోర్టు ఆర్డరుపై స్టే విధించలేరు? అని కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదించారు. అంతేకాకుండా హైకోర్టు అలా స్టే విధించడం ఊహించని విషయమన్నారు. కింది కోర్టులో తనకు అనుకూల తీర్పు వచ్చినప్పుడు ఎందుకు వేచి ఉండాలని వాదించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. హైకోర్టు నిర్ణయం కాస్త అసాధారణంగానే కనిపిస్తోందని.. అయినప్పటికీ ఒకవేళ హైకోర్టు తప్పిదం చేస్తే తాము దాన్ని పునరావృతం చేయాలా? అని పిటిషనర్ను ప్రశ్నించింది. ఒకరోజు వేచిచూడడం వల్ల ఇబ్బంది ఏముందని, జూన్ 26న దీనిపై విచారణ చేపడతామని తెలిపింది. మరోవైపు కేజ్రీవాల్ బెయిల్ స్టేపై ఢిల్లీ హైకోర్టు మంగళవారం నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది.