Friday, October 4, 2024
HomeUncategorizedమరో వివాదంలో ఐఏఎస్‌ అధికారిణి రోహిణి సింధూరి

మరో వివాదంలో ఐఏఎస్‌ అధికారిణి రోహిణి సింధూరి

Date:

తన భూమిని ఆక్రమించారని ఆరోపిస్తూ కర్ణాటక క్యాడర్‌కు చెందిన తెలుగు ఐఏఎస్‌ అధికారిణి రోహిణి సింధూరిపై బాలీవుడ్‌ గాయకుడు లక్కీ అలీ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫిర్యాదు కాపీని ఎక్స్‌ ఖాతాలో పంచుకున్నారు. బెంగళూరు శివారులోని యెలహంక ప్రాంతంలో తన వ్యవసాయ భూమిని ఐఏఎస్‌ రోహిణి, ఆమె భర్త సుధీర్‌ రెడ్డి, బంధువు మధుసూదన్‌ రెడ్డి అక్రమంగా లాక్కొన్నారని లక్కీ అలీ ఆరోపించారు. ఇందుకు కొందరు స్థానిక పోలీసు అధికారులు ఆమెకు సాయం చేసినట్లు తెలిపారు. 2022లోనే దీనిపై తాను కేసు పెట్టినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అందుకే తాను లోకాయుక్త పోలీసులను ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. గాయకుడి ఫిర్యాదుతో యెలహంక న్యూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

గతేడాది ఐపీఎస్‌ రూపా మౌద్గిల్‌తో వివాదంతో ఐఏఎస్‌ రోహిణి సింధూరి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. రోహిణి వ్యక్తిగత చిత్రాలను బయటపెడుతూ ఐపీఎస్‌ రూప చేసిన ఆరోపణలు.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. రూప ఆరోపణలకు రోహిణి కూడా సోషల్‌ మీడియాలో దీటుగా స్పందించారు. తనకు వ్యతిరేకంగా ఆరోపణలు చేసి, సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టిన రూప తనకు క్షమాపణలు చెప్పాలని, దాంతో పాటు రూ.కోటి ఇవ్వాలని రోహిణి డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారం కాస్త తీవ్ర దుమారం రేపడంతో అప్పటి ప్రభుత్వం వీరిపై చర్యలు తీసుకుంది. వీరిద్దరికీ ఎలాంటి పోస్టులు కేటాయించకుండా బదిలీ వేటు వేసింది.