తనకు నచ్చిన యువకుడిని పెళ్లి చేసుకోవడం కోసం ఏకంగా అతడికి లింగ మార్పిడి శస్త్రచికిత్స చేయించాడు. అది కూడా అతడికి ఏమాత్రం తెలియకుండా మత్తుమందు ఇప్పించి అమ్మాయిగా మార్చేశాడు. ఉత్తరప్రదేశ్లోని ముజఫుర్నగర్లో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముజఫర్నగర్కు చెందిన 20 ఏళ్ల యువకుడికి ఓంప్రకాశ్ అనే వ్యక్తి రెండేళ్లుగా సన్నిహితంగా ఉంటున్నాడు. ఇటీవల ఆ యువకుడు అనారోగ్యానికి గురవడంతో మెడికల్ చెకప్ చేయిస్తానంటూ ఓంప్రకాశ్ జూన్ 3న మన్సూర్పుర్లోని బేగ్రాజ్పుర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ యువకుడిని పరీక్షించిన వైద్యులు చిన్న సర్జరీ చేయాలని సూచించారు. అనంతరం అతడికి మత్తుమందు ఇచ్చి వ్యక్తిగత అవయవాలను తొలగించి లింగమార్పిడి శస్త్రచికిత్స చేశారు. వైద్యులతో కలిసి ప్రకాశ్ నాటకమాడి ఈ తతంగమంతా నడిపినట్లు తెలిసింది.
ఆసుపత్రికి తీసుకొచ్చిన మరుసటి రోజు నాకు ఆపరేషన్ చేశారు. స్పృహలోకి రాగానే నేను అమ్మాయిగా మారిపోయానని చెప్పారు. అప్పుడు ఓంప్రకాశ్ అక్కడికి వచ్చి తానే ఇదంతా చేయించానని అన్నాడు. ఇక నేను జీవితాంతం తనతోనే ఉండొచ్చని చెప్పాడు. పెళ్లి కోసం ఏర్పాట్లు కూడా చేశానన్నాడు. ఇందుకు అంగీకరించకపోతే నా తండ్రిని చంపేస్తానని బెదిరించాడు. మా భూమిని కూడా లాక్కొన్నాడు” అని బాధిత యువకుడు ఆవేదన వ్యక్తంచేశాడు.
ఎలాగో ధైర్యం చేసి కుటుంబసభ్యులకు విషయం చెప్పడంతో బాధితుడి తండ్రి జూన్ 16న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఓంప్రకాశ్ను అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దుమారం రేపింది. భారతీయ కిసాన్ యూనియన్ సభ్యులు దీనిపై ఆందోళన చేపట్టారు. నిందితుడితో పాటు సర్జరీ చేసిన వైద్యులపైనా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఘటనతో బాధిత యువకుడిపై శారీరకంగా, మానసికంగా తీవ్ర ప్రభావం పడిందని, ఇందుకుగానూ అతడికి రూ.2కోట్లు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.