Friday, October 4, 2024
HomeUncategorizedరామాయణాన్ని కించపరుస్తూ విద్యార్థుల నాటకం

రామాయణాన్ని కించపరుస్తూ విద్యార్థుల నాటకం

Date:

ఐఐటి బాంబే విద్యార్థులు రామాయణాన్ని కించపరుస్తూ నాటకం వేశారని భావిస్తూ ప్రతిష్ఠాత్మక ఐఐటీ బాంబే విద్యాసంస్థ భారీ జరిమానా విధించింది. ఒక్కో విద్యార్థికి ఏకంగా రూ.1.20 లక్షల చొప్పున ఫైన్‌ వేసింది. ఈ ఏడాది మార్చి 31వ తేదీన ఐఐటీ బాంబేలో వార్షిక ఆర్ట్స్‌ ఫెస్టివల్‌ జరిగింది. ఫెస్ట్‌లో భాగంగా కొందరు విద్యార్థులు ‘రాహోవన్‌’ పేరుతో నాటకాన్ని ప్రదర్శించారు. రామాయణానికి ఇది పేరడీ. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వీడియోలు చూసిన పలువురు ఈ స్కిట్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నాటకంలో భాగంగా విద్యార్థులు ఉపయోగించిన భాష, హావభావాలు అనుచితంగా ఉన్నాయంటూ విమర్శలు చేస్తున్నారు. హిందువులు ఎంతో గొప్పగా భావించే రామాయణాన్ని కించపరిచారని ఆరోపించారు. మత విశ్వాసాలను దెబ్బ తీసేలా ఈ స్కిట్‌ ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీంతో ఐఐటీ బాంబే యాజమాన్యం చర్యలు చేపట్టింది. క్రమశిక్షణా కమిటీని ఏర్పాటు చేసి ఘటనపై దర్యాప్తు జరిపించింది. అనంతరం స్కిట్‌ ప్రదర్శించిన ఎనిమిది మంది విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. 8 మందిలో నలుగురికి ఒక్కొక్కరికి రూ.1.2 లక్షల జరిమానా విధించగా మరో నలుగురికి ఒక్కొక్కరికీ రూ.40 వేల ఫైన్ వేసింది. దీంతోపాటు హాస్టల్‌ నుంచి డిబార్ చేసింది. మరో నెల రోజుల్లోగా ఈ జరిమానా చెల్లించాలని తేల్చి చెప్పింది. ఈ నిబంధనల్ని ఉల్లంఘిస్తే మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.