Friday, October 4, 2024
HomeUncategorizedభారత సైన్యంలో 'చర్మనిధి' కేంద్రం

భారత సైన్యంలో ‘చర్మనిధి’ కేంద్రం

Date:

కేంద్ర ప్రభుత్వం భద్రత బలగాల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే మొట్టమొదటిసారి ‘చర్మనిధి’ కేంద్రాన్ని ప్రారంభించింది. ఆర్మీ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు కాలిన గాయాలు, ఇతర చర్మ సంబంధిత చికిత్సల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు రక్షణశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్ (పరిశోధన, రెఫరల్)లో స్కిన్ బ్యాంకును ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ సర్జన్లు, ప్రత్యేక సాంకేతిక నిపుణులు సహా అత్యున్నత స్థాయి వైద్య బృందం ఇక్కడ అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. చర్మ సేకరణ, ప్రాసెసింగ్, నిల్వ, పంపిణీకి ఈ స్కిన్‌ బ్యాంకు హబ్‌గా పనిచేస్తుందని, అవసరమైన సందర్భాల్లో దేశవ్యాప్తంగా ఉన్న సైనిక వైద్య కేంద్రాలకు చేరవేస్తుందని వెల్లడించారు.

సాయుధ సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం, సంక్షేమం పట్ల సైన్యం నిబద్ధతకు స్కిన్‌ బ్యాంకు ఓ నిదర్శనమని డీజీఎంఎస్‌ (ఆర్మీ), కర్నల్‌ కమాండెంట్‌ లెఫ్టినెంట్ జనరల్ అరిందమ్ ఛటర్జీ పేర్కొన్నారు. చర్మం విషయంలో ప్రత్యేకంగా కేంద్రాన్ని కలిగి ఉండటం ద్వారా రోగులకు అత్యంత అధునాతన చికిత్స అందించగలమని ఆర్మీ హాస్పిటల్ కమాండెంట్‌ లెఫ్టినెంట్ జనరల్ అజిత్ నీలకంఠన్ తెలిపారు.

ఏంటీ స్కిన్‌ బ్యాంకు?

కాలిన గాయాలు, గ్రహణం మొర్రి, తెగిన చేతులు, వేళ్లు అతికించడం.. ఇతరత్రా చికిత్సలకు చర్మం అవసరం అవుతుంది. రోగి శరీరంలోని కాళ్లు, చేతులు, తొడలు తదితర భాగాల నుంచి చర్మం సేకరించి గ్రాఫ్టింగ్‌ ద్వారా గాయాలైన చోట అమర్చుతున్నారు. అయితే.. రోగి శరీరం నుంచి 15-20 శాతం మాత్రమే ఇలా సేకరించడానికి వీలవుతుంది. అంతకంటే ఎక్కువ కావాల్సి వచ్చినప్పుడు అందుబాటులో ఉండటం లేదు. ఈ నేపథ్యంలో ఏర్పాటైందే స్కిన్‌ బ్యాంకు.