బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్రావు తాను పార్టీ మారబోతున్నట్లుగా జరుగుతున్న ప్రచారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో ఆయన సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అనంతరం పార్టీ మారనున్నట్లుగా వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. సోషల్ మీడియాతో పాటు బ్రేకింగ్స్, వ్యూవ్స్ కోసం పలు మీడియా సంస్థలు తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.
తాను కాంగ్రెస్లోకి చేరుతున్నట్లుగా కొందరు రాస్తే.. బీజేపీలో చేరబోతున్నట్లుగా మరికొందరు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబోతున్నానంటూ ఇంకొందరు తమకు నచ్చినట్లుగా రాసుకుంటూ వెళ్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఇలాంటి వార్తల కారణంగా నేతల క్రెడిబిలిటీ దెబ్బతింటుందని.. ఇకపై తన విషయంలో తప్పుడు వార్తలు ప్రచారం చేయడం మానాలని ఆయన హితవు పలికారు. తన క్రెడిబిలిటిని, పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హరీశ్రావు హెచ్చరించారు. ఏదైనా ఉంటే తనతో మాట్లాడి నిజానిజాలు తెలుసుకున్న తర్వాతే వార్తలు రాయాలని సూచించారు.