Friday, October 4, 2024
HomeUncategorizedదేశంలో వరుస ఉగ్ర ఘటనలపై మోడీ సమీక్ష

దేశంలో వరుస ఉగ్ర ఘటనలపై మోడీ సమీక్ష

Date:

దేశంలో ఇటీవల నాలుగు రోజుల వ్యవధిలో నాలుగు ఉగ్ర దాడులు జరిగాయి. ఈ క్రమంలోనే జమ్మూ-కశ్మీర్‌లోని భద్రత పరిస్థితులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం సమీక్షించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ డోభాల్‌, జమ్మూ-కశ్మీర్‌ ఎల్జీ మనోజ్‌సిన్హాలతో మాట్లాడారు. స్థానికంగా భద్రత పరిస్థితులు, ఉగ్ర వ్యతిరేక కార్యకలాపాల గురించి వారు ప్రధానికి వివరించారు. ఈ క్రమంలోనే ఉగ్ర నిరోధక సామర్థ్యాలను పూర్తిస్థాయిలో రంగంలోకి దించాలని ప్రధాని ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

యాత్రికులే లక్ష్యంగా ఇటీవల జమ్మూ-కశ్మీర్‌లోని పర్యటక బస్సుపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మంగళవారం సాయంత్రం కఠువా జిల్లాలోని హీరానగర్ సెక్టార్‌లో ఒక ఇంటిపై దాడి జరిగింది. ఈ క్రమంలోనే భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక సీఆర్‌పీఎఫ్ జవాన్‌ అమరుడైనట్లు అధికారులు తెలిపారు. దోడా జిల్లాలోని భదర్వా-పఠాన్‌కోట్‌ రహదారి సమీపంలోని ఒక చెక్‌పోస్టుపై మంగళవారం జరిగిన దాడిలో.. రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఐదుగురు సిబ్బంది, ఒక పోలీసు అధికారి గాయపడ్డారు. ఇదే జిల్లాలోని మరో ఘటనలో ఒక పోలీసు అధికారి గాయాలపాలయ్యారు. జమ్మూ-కశ్మీర్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు పాకిస్థాన్‌ కుయుక్తులు పన్నుతోందని డీజీపీ ఆర్‌ఆర్‌ స్వైన్‌ ఆరోపించారు. శత్రుమూకలకు బుద్ధి చెప్పేందుకు బలగాలు సంసిద్ధంగా ఉన్నాయని స్పష్టంచేశారు.