అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒక మహిళ మంత్రి బాధ్యతలు స్వీకరించారు. ఆమె దొసాంగ్లు పుల్. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో హాయులియాంగ్ నియోజకవర్గం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాజీ ముఖ్యమంత్రి కలిఖో పుల్ సతీమణి అయిన ఆమెను మద్దతుదారులు ఐరన్ లేడీ అని పిలుస్తుంటారు. భర్త మరణానంతరం ఆయన ప్రాతినిధ్యం వహించిన ఆ స్థానంలో 2016 నుంచి ఎన్నికవుతున్నారు. అయితే ప్రస్తుత క్యాబినెట్లో ఆమెకు ఏ శాఖ అప్పగిస్తారో తెలియాల్సిఉంది.
మాజీ సీఎం దోర్జీ ఖండూ కుమారుడు పెమా ఖండూ. పెమా 2000లో కాంగ్రెస్లో చేరారు. తండ్రి మరణం తర్వాత రాజకీయాల్లో పెమా వేగంగా ఎదిగారు. నబమ్ తుకి ప్రభుత్వం (కాంగ్రెస్)లో మంత్రిగా పనిచేశారు. 2016లో అరుణాచల్లో రాజ్యాంగ సంక్షోభం తలెత్తింది. రాష్ట్రపతి పాలనను ఎత్తివేశాక భాజపా మద్దతుతో ఏర్పాటైన కలిఖో పుల్ సర్కారులో పెమా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తర్వాత పీపీఏలో చేరిన ఆయన.. ఆ వెంటనే తన మద్దతుదారులతో కలిసి భాజపాలో చేరారు. తాజా ఎన్నికల్లో 60 స్థానాలకు గానూ 46 సీట్లను గెల్చుకొని వరుసగా మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి భాజపా అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా, కిరణ్ రిజిజు వంటి వారు హాజరయ్యారు.