ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆయనతో ప్రమాణం చేయించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది నాలుగోసారి. అనంతరం మంత్రులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో సభా ప్రాంగణం జై చంద్రన్న నినాదాలతో మార్మోగిపోయింది. తెదేపా నేతలు, కార్యకర్తలు తమ స్థానాల్లోనే నిలుచుని చప్పట్లతో అభినందనలు పలికారు. ప్రమాణ స్వీకారం అనంతరం ప్రధాని మోదీతో పాటు వేదికపై ఉన్న పలువురు అతిథులు చంద్రబాబుకు శుభాకాంక్షలు చెప్పారు.
ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, కేంద్ర మంత్రులు అమిత్షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, రామ్మోహన్నాయుడు, చిరాగ్ పాసవాన్తో పాటు వివిధ పార్టీలకు చెందిన పలువురు జాతీయ నాయకులు హాజరయ్యారు. సినీ ప్రముఖులు చిరంజీవి, రజనీకాంత్ దంపతులు, రామ్చరణ్ తదితరులు వచ్చారు.