దేశ రాజధాని నగరం ఢిల్లీలో రోజురోజుకు నీటి కొరత పెరిగిపోతుంది. ప్రజలు నీటి కోసం ట్యాంకర్లపై ఆధారపడిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ట్యాంకర్ మాఫియా కట్టడికి, నీటి వృథాను అరికట్టడానికి ఆప్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. హిమాచల్ ప్రదేశ్ నుంచి మిగులుజలాలు విడుదల కోరుతూ అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం చేసిన అభ్యర్థన నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం స్పందించింది.
ట్యాంకర్ మాఫియా విస్తృతంగా కనిపిస్తోంది. ఆ నీటినంతా ఆ మాఫియా మింగేసింది. నీరు వృథా అవుతోంది. దానిపై మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి వస్తోన్న నీరు ఎటుపోతోంది? ప్రజలు బాధపడుతున్నారు. మీడియాలో ఆ దృశ్యాలను మేం చూస్తున్నాం. వేసవిలో నీటి ఎద్దడి పదేపదే ఎదురవుతుంటే.. వృథాను అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు?” అని ప్రశ్నించింది. కోర్టుముందు ఎందుకు అసత్య ప్రకటనలు చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వం చర్యలు తీసుకోలేకపోతే.. ఆ పని పోలీసులకు అప్పగిస్తామని వ్యాఖ్యానించింది. దీనిపై ఢిల్లీ తరఫు న్యాయవాది కోర్టులో తన వాదన వినిపించారు. నీటి వృథా కట్టడికి తీసుకుంటున్న చర్యలను వెల్లడించిన ఆయన.. వాటిపై ఒక అఫిడవిట్ దాఖలు చేస్తామని చెప్పారు. ఆ దిశగా వెంటనే నివేదికను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. తప్పుడు ప్రకటనలు చేస్తున్నారంటూ ఈ సందర్భంగా హిమాచల్ ప్రభుత్వాన్ని కూడా మందలించింది. అలాగే విచారణను గురువారానికి వాయిదా వేసింది.