రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తి చనిపోయాడనుకొని కుటుంబసభ్యులు అతడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించింది. అయితే పెద్ద కర్మ ముందు రోజు ఆ వ్యక్తి తన కుటుంబానికి ఫోన్ చేశాడు. ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు. అతడు బతికే ఉన్నాడని తెలుసుకున్న కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. మధ్యప్రదేశ్లోని షియోపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. లహచోరా గ్రామానికి చెందిన సురేంద్ర శర్మ, రాజస్థాన్ రాజధాని జైపూర్లోని క్లాత్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. రాజస్థాన్లోని సవాయ్ మాధోపూర్ సమీపంలోని సుర్వాల్లో గత నెలలో రోడ్డు ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని గుర్తించాలని కోరుతూ సామాజిక కార్యకర్త ఒక ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వ్యక్తిని సురేంద్రగా అతడి కుటుంబ సభ్యులు గుర్తించారు. జైపూర్లోని ఆసుపత్రికి వారు తరలించగా చికిత్స పొందుతూ అతడు మరణించాడు. దీంతో రాజస్థాన్ పోలీసులు పోస్ట్మార్టం తర్వాత ఆ వ్యక్తి మృతదేహాన్ని సురేంద్ర కుటుంబానికి అప్పగించారు. మే 28న అంత్యక్రియలు నిర్వహించారు.
మరోవైపు 13వ రోజున సురేంద్రకు దశ దిన కర్మలు చేసేందుకు అతడి కుటుంబం సిద్ధమైంది. అయితే ముందు రోజు సురేంద్ర నుంచి ఫోన్ వచ్చింది. నమ్మని సోదరుడు వీడియో కాల్ చేయాలని చెప్పాడు. అతడు వీడియో కాల్ చేయగా సురేంద్ర బతికే ఉన్నాడని కుటుంబ సభ్యులు తెలుసుకుని షాక్ అయ్యారు. వెంటనే ఇంటికి తిరిగి రావాలని చెప్పారు. అలాగే 13 రోజున నిర్వహించాల్సిన కర్మకాండలను వాయిదా వేశారు. ఇంటికి తిరిగి వచ్చిన సురేంద్ర తన ఫోన్ పాడైందని తెలిపాడు. అందుకే రెండు నెలలుగా కుటుంబానికి ఫోన్ చేయలేదని చెప్పాడు. అయితే అతడు బతికే ఉన్నాడని రాజస్థాన్ పోలీసులకు తెలిసింది. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని తప్పుగా గుర్తించి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించిన సురేంద్ర కుటుంబంపై దర్యాప్తు చేస్తున్నారు.