మాతా వైష్ణవోదేవి క్షేత్రానికి జూన్ 18వ తేదీ నుంచి నేరుగా హెలికాప్టర్ సేవలను ప్రారంభించనున్నట్లు ఎస్ఎంవీడీబీ ప్రకటించింది. భక్తులకు ఉత్తమ సేవలు అందించాలన్న ఉద్దేశంతో డైరెక్టుగా జమ్మూ నుంచి భవన్ వరకు హెలికాప్టర్ సర్వీసులను మొదలుపెట్టినట్లు వైష్ణవోదేవి బోర్డు సీఈవో అన్షుల్ గార్గ్ తెలిపారు. హెలికాప్టర్ సర్వీసు ప్యాకేజీ బుక్ చేసుకున్నవాళ్లకు బ్యాటరీ కార్ సేవ, ప్రత్యేక దర్శనం, ప్రసాదం, రోప్వే సేవలు కూడా కల్పించనున్నారు. వైష్ణవోదేవి బోర్డు వెబ్సైట్ ద్వారా హెలికాప్టర్ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు. ఆలయం వద్ద ఉన్న పంచీ హెలిప్యాడ్లో ల్యాండైన తర్వాత భక్తులను నేరుగా భవన్కు తీసుకెళ్తారు. దర్శనం తర్వాత భైరన్ ఆలయానికి వెళ్లేందుకు కేబుల్ కారు టికెట్ను కూడా కల్పిస్తారు. ప్రస్తుతం కాట్రా, సంజిచాట్ నుంచి మాత్రమే వైష్ణవోదేవి ఆలయానికి హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉన్నాయి. రయిసి జిల్లాలో ఉన్న వైష్ణవోదేవి ఆలయానికి ప్రతి ఏడాది కోటి మంది భక్తులు వరకు వస్తుంటారు.