Thursday, October 3, 2024
HomeUncategorizedజైలు నుంచే గెలుపొందిన ఇద్దరు ఎంపీలు

జైలు నుంచే గెలుపొందిన ఇద్దరు ఎంపీలు

Date:

దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇద్దరు జైలు నుంచి గెలుపొందారు. పంజాబ్‌లోని ఖడూర్‌ సాహిబ్‌ స్థానం నుంచి వేర్పాటువాది అమృత్‌పాల్‌ సింగ్‌, జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా నుంచి ఉగ్రనిధుల కేసు నిందితుడు ఇంజినీర్‌ రషీద్‌ తాజా లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందారు. ప్రస్తుతం వీరిద్దరూ జైల్లో ఉండటంతో ఎంపీగా ప్రమాణస్వీకారం చేసేందుకు అనుమతిస్తారా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే, రాజ్యాంగ నిబంధనల ప్రకారం వీరు ప్రమాణం చేసేందుకు అర్హులేనని లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్‌, రాజ్యాంగ నిపుణులు పీడీటీ ఆచారి తెలిపారు.

ఇలాంటి కేసుల్లో రాజ్యాంగ నిబంధనలు పాటించడం అత్యంత అవశ్యం. ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి చట్టసభ్యుడిగా ప్రమాణం చేయడం అనేది రాజ్యాంగపరమైన హక్కు. అయితే, ప్రస్తుతం వీరిద్దరూ జైల్లో ఉన్నందున ప్రమాణస్వీకారం కోసం పార్లమెంట్‌కు తీసుకెళ్లేందుకు అధికారుల నుంచి అనుమతి పొందాలి. ప్రమాణం పూర్తయిన తర్వాత తిరిగి జైలుకు వెళ్లాలి” అని ఆచారి వెల్లడించారు. జైల్లో ఉన్న వ్యక్తులు సభా కార్యకలాపాలకు హాజరయ్యేందుకు చట్టం అనుమతించదు. అందువల్ల ఎంపీగా ప్రమాణం చేసిన తర్వాత వారు సభకు హాజరుకాలేకపోవడంపై స్పీకర్‌కు లేఖ రాయాల్సి ఉంటుంది. వారి అభ్యర్థనలను సభాపతి సభ్యుల గైర్హాజరీపై ఏర్పాటైన హౌస్‌ కమిటీకి పంపుతారు. ఈ అభ్యర్థులను అంగీకరించాలా? వద్దా అన్నదానిపై కమిటీ సిఫార్సులు చేస్తుంది. వాటిపై సభలో ఓటింగ్‌ నిర్వహించి నిర్ణయం తీసుకుంటారని ఆచారి తెలిపారు.