కాంగ్రెస్ పార్టీ కంచుకోట అయిన అమేఠీ స్థానాన్ని కాంగ్రెస్ తిరిగి చేజిక్కించుకుంది. ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థి కిశోరీ లాల్ శర్మ కేంద్రమంత్రి స్మృతి ఇరానీపై విజయం సాధించారు. దీనిపై ఆ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ ఆనందం వ్యక్తం చేశారు. ఆమె సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు పెట్టారు. ”కిశోరీ లాల్ భయ్యా మీరు గెలుస్తారని నాకు తెలుసు. మీ విషయంలో నేనెప్పుడూ సందేహించలేదు. మీకు, నియోజకవర్గంలోని నా ప్రియమైన సోదర, సోదరీమణులకు అభినందనలు” అని రాసుకొచ్చారు.
2019 లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీని స్మృతి ఇరానీ ఓడించి.. దశాబ్దాల తర్వాత గాంధీ కుటుంబం నుంచి అమేఠీ సీటును కైవసం చేసుకున్నారు. అప్పుడు వయనాడ్ నుంచి రాహుల్ గెలుపొందారు. 2024 ఎన్నికల్లో వయనాడ్తోపాటు.. అమేఠీలో కూడా రాహుల్ పోటీ చేస్తారని తొలుత ప్రచారం జరిగింది. చివరి నిమిషంలో రాహుల్ రాయ్బరేలీ నుంచి బరిలోకి దిగారు. కాంగ్రెస్ తరఫున గాంధీల కుటుంబానికి నమ్మకస్థుడైన శర్మను రంగంలోకి దింపారు. ప్రస్తుతం రెండు స్థానాల్లోనూ రాహుల్ గెలుపొందగా.. అమేఠీని కూడా కాంగ్రెస్ సొంతం చేసుకుంది.