ఒక వ్యక్తి క్రికెట్ మైదానంలో బ్యాటింగ్ చేస్తూ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో జరిగింది. థానేకు చెందిన కొందరు వ్యక్తులు స్థానిక మైదానంలో క్రికెట్ ఆడుతున్నారు. ఈ క్రమంలో బ్యాటింగ్ చేస్తున్న ఓ వ్యక్తి కాసేపు చురుగ్గా ఆడాడు. సిక్స్లతో అదరగొట్టాడు. మరో బంతిని ఎదుర్కొనే క్రమంలోనే అస్వస్థతకు గురయ్యాడు. ఒక్కసారిగా నిలుచున్నచోటే కుప్పకూలాడు. వెంటనే స్పందించిన సహచర ఆటగాళ్లు అతడిని కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అతడు ప్రాణాలు కోల్పోవడంతో మైదానంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆ వ్యక్తి గుండెపోటుతోనే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే.. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
గతంలోనూ మైదానంలో క్రికెట్ ఆడుతూ ఆటగాళ్లు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లోని నోయిడాకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. ముంబయిలోని ఓ ప్రాంతంలో 50 ఏళ్లకు పైబడిన వారికి నిర్వహించిన టోర్నీలో ఒక ఆటగాడి తలకు బంతి తగలడంతో అక్కడికక్కడే మృతి చెందడం బాధాకరం.