భానుడి భగభగలకు ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. ఎండలకు తట్టుకోలేక జనం అల్లాడిపోతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్కు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. వడదెబ్బ బారినపడి మరణిస్తున్నారు. దీంతో పోస్ట్మార్టం కోసం వచ్చే మృతదేహాలతో మార్చురీలు నిండిపోతున్నాయి. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గత రెండు రోజుల్లో ఎండల వల్ల 60 మందికిపైగా మరణించారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లోని పోస్ట్మార్టం గది మృతదేహాలతో నిండిపోయింది. ఈ నేపథ్యంలో కొన్ని మృతదేహాలను ఆ గది బయట ఉంచారు.
శుక్రవారం మృతదేహాలకు పోస్ట్మార్టం చేసే ఇద్దరు డాక్టర్లు కూడా ఎండకు తాళలేక సొమ్మసిల్లిపడిపోయారు. కొందరు బంధువులు కూడా ఇబ్బందులుపడ్డారు. అయితే వడదెబ్బ వల్ల పేరుకుపోతున్న మృతదేహాల అంశంపై జిల్లా అధికారులు స్పందించారు. తగిన చర్యలు చేపట్టాలని వైద్యాధికారులను ఆదేశించారు. మరోవైపు మృతదేహాల్లో సగానికిపైగా గుర్తు తెలియని వ్యక్తులవని పోలీసులు తెలిపారు. దీంతో మృతులను గుర్తించడం కష్టం మారిందన్నారు.