బీహార్లో వేసవి సెలవులు ముగియడంతో బుధవారం నుంచి ఆ రాష్ట్రంలో స్కూళ్లను తెరిచారు. అయితే ఉష్ణోగ్రత 47 డిగ్రీలు దాటడంతో ఎండ తీవ్రతను విద్యార్థులు తట్టుకోలేకపోయారు. పలు ప్రాంతాల్లోని స్కూళ్లలో విద్యార్థులు సొమ్మసిల్లిపోయారు. షేక్పురా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో 16 మంది బాలికలు స్పృహతప్పి పడిపోయారు. టీచర్లు వారికి సపర్యలు చేశారు. ఆటోలు, బైక్లపై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ బీహార్లో స్కూళ్లను తెరువడంపై విమర్శలు వెల్లువెత్తాయి. గ్రామస్తులు స్కూళ్లకు వెళ్లి టీచర్లతో ఘర్షణపడ్డారు. అలాగే రహదారిని దిగ్బంధించి నిరసన వ్యక్తం చేశారు. సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ స్కూళ్లను తెరువడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. మరోవైపు బీహార్లో ప్రభుత్వం, ప్రజాస్వామ్యం లేదని, బ్యూరోక్రసీ మాత్రమే ఉందని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ విమర్శించారు. ‘ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు పైగా ఉన్నాయి. బీహార్ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు సరిగా లేవు. కానీ సీఎం చేతుల్లో ఏమీ లేదు’ అని మండిపడ్డారు.