Wednesday, October 2, 2024
HomeUncategorized18 రోజుల్లో 5 లక్షల మందికిపైగా దర్శనం

18 రోజుల్లో 5 లక్షల మందికిపైగా దర్శనం

Date:

చార్‌ధామ్‌ యాత్రలో భాగంగా కేదార్‌నాథ్‌ ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఆలయ ద్వారాలు తెరిచిన నాటి నుంచి ఇప్పటి వరకు 5 లక్షల మందికిపైగా భక్తులు బాబా కేదార్‌ను దర్శించుకున్నారు. చార్‌ధామ్‌ యాత్రలో భాగంగా ఈనెల 10న కేదార్‌నాథ్‌ ఆలయ తలుపులు తెరిచిన విషయం తెలిసిందే. ఆలయం తెరిచిన 18 రోజుల వ్యవధిలో 5,09,688 మంది భక్తులు బాబా కేదార్‌ను దర్శించుకున్నారు.

మరోవైపు భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. యాత్ర ఏర్పాట్లను రుద్రప్రయాగ్ జిల్లా మేజిస్ట్రేట్ సౌరభ్ గహర్వార్ నిరంతరం సమీక్షిస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం, ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను మరింత పటిష్టం చేయాలని సంబంధిత అధికారులందరినీ ఆదేశించారు. చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లాలనుకునే భక్తులు తప్పనిసరిగా ముందుగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం స్పష్టంచేసింది. రిజిస్ట్రేషన్‌ తేదీ కన్నా ముందుగా ప్రయాణం పెట్టుకోవద్దని కోరింది. రిజిస్ట్రేషన్‌ లేని భక్తులకు యాత్రకు అనుమతించబోమని స్పష్టం చేసింది.