Wednesday, October 2, 2024
HomeUncategorizedచిన్నారులు చనిపోతుంటే కళ్లు మూసుకున్నారా?

చిన్నారులు చనిపోతుంటే కళ్లు మూసుకున్నారా?

Date:

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ అగ్నిప్రమాదం కేసుపై గుజరాత్‌ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈసందర్భంగా రాజ్‌కోట్ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (ఆర్ఎంసీ) అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడింది. ”మీ పరిధిలో ఇంతటి భవనం ఉందని మీకు తెలియదా? కళ్లు మూసుకున్నారా? ఫైర్‌ సేఫ్టీ లేకుండా రెండున్నరేళ్లుగా ఇది ఉందని ఎలా చెబుతారు. టికెట్‌ వసూలు చేసేటప్పుడు వినోద పన్ను గురించి తెలియదా?” అని జస్టిస్‌ బైరెన్‌ వైష్ణవ్‌, జస్టిస్‌ దేవాన్‌దేశాయ్‌లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. ఆ భవనం ప్రారంభ కార్యక్రమంలో మునిసిపల్‌ కమిషనర్‌ కూడా పాల్గొన్నట్లు మీడియా కథనాలను చూపిస్తూ.. ఆ అధికారులు ఎవరు? వాళ్లంతా ఆడుకోవడానికి అక్కడికి వెళ్లారా? అని ప్రశ్నించారు.

ఆ గేమ్‌ జోన్‌ ఏర్పాటైనప్పటి (2021) నుంచి ఈ ప్రమాదం జరిగినంతవరకు రాజ్‌కోట్‌ కమిషనర్లుగా పనిచేసినవారంతా ఈ విషాదానికి బాధ్యత వహించాల్సిందేనని హైకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది. వారంతా వేర్వేరుగా అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. అనుమతుల కోసం టీఆర్‌పీ గేమ్‌ జోన్‌ తమను సంప్రదించలేదంటూ ఆర్ఎంసీ తరఫు న్యాయవాది వివరించే సమయంలో హైకోర్టు ధర్మాసనం ఈ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

ఈ దురదృష్టకర సంఘటన నేపథ్యంలో.. దీనికి ఓ వ్యక్తిని బాధ్యుడిని చేసేందుకు ప్రభుత్వం ముందుకురావాలని, అప్పుడే కఠిన చర్యలు తీసుకోవచ్చని తెలిపింది. పిటిషనర్‌ చేసిన విన్నపంపై ధర్మాసనం స్పందిస్తూ..” కఠిన చర్యలు ఎవరు తీసుకుంటారు? రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంపై మాకు నమ్మకం లేదు. మేం ఆదేశాలిచ్చిన నాలుగేళ్ల తర్వాత కూడా.. ఇలా జరగడం ఇది ఆరోసారి. ప్రాణాలు కోల్పోవడాన్నే వాళ్లు కోరుకుంటారు. ఆ తర్వాత యంత్రాంగాన్ని పురమాయిస్తారు. ఫైర్‌ సేఫ్టీకి సంబంధించి ఓ పిల్‌పై గతంలో ఇచ్చిన ఆదేశాలపై ఏం చేశారు. నెలలుగా కార్పొరేషన్‌ ఏం చేస్తోంది’ అని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.