ఒక వ్యక్తి ఓ ప్రమాదంలో రెండు కాళ్లు, ఓ చేయి కొల్పోయాడు. ఐనా తన ఆశయానికి అంగవైకల్యం అడ్డే కాదని భావించాడు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరాన్ని అధిరోహించడమే లక్ష్యంగా పెట్టుకొన్నాడు. ఈ క్రమంలో ఎన్నో సవాళ్లను అధిగమించిన ఆ ముప్పైఏళ్ల యువకుడు.. ఎవరెస్టు శిఖరాన విజయ సంకేతం చూపించి ప్రపంచ రికార్డు సృష్టించాడు.
టింకేశ్ కౌశిక్.. తొమ్మిదేళ్ల ప్రాయంలోనే కరెంటు షాక్తో రెండు కాళ్లు, ఓ చేయి కోల్పోయాడు. కృత్రిమ అవయవాలను వాడుతున్నాడు. కొన్నేళ్ల క్రితం గోవాకు వచ్చిన కౌశిక్, ఫిట్నెస్ కోచ్గా పని చేస్తున్నాడు. ఎలాగైనా ఎవరెస్టును అధిరోహించాలని ఆశయంగా పెట్టుకున్న ఆయన.. అందుకోసం తీవ్రంగా శ్రమించాడు. మే 4 నేపాల్ నుంచి సాహసయాత్రను మొదలుపెట్టిన ఆయన మే 11న బేస్ క్యాంపుపై జాతీయజెండా ఎగురవేశాడు. ఈ క్రమంలో పలు సవాళ్లను ఎదుర్కొన్నట్లు చెప్పాడు.
మూడు అవయవాలు 90శాతం కోల్పోయి.. ఎవరెస్టును అధిరోహించిన తొలి వ్యక్తిగా కౌశిక్ రికార్డు సృష్టించారని గోవా వికలాంగ సంఘం పేర్కొంది. దివ్యాంగులకు ఆదర్శంగా నిలవడంతోపాటు గోవాకు ఇదెంతో గర్వకారణమని ఆ సంస్థ చీఫ్ అవెలినో డిసౌజా అభిప్రాయపడ్డారు. కౌశిక్ ఈ ఘనత సాధించడంపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ స్పందిస్తూ.. రాష్ట్రం గర్వించదగ్గ విషయమన్నారు. ఈ విజయం యువతకెంతో స్ఫూర్తిదాయకమని, ఆయనకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తున్నానని ట్వీట్ చేశారు.