Wednesday, October 2, 2024
HomeUncategorizedఎంపీ అభ్యర్థి ఆస్తి కేవలం రూ.2 మాత్రమే

ఎంపీ అభ్యర్థి ఆస్తి కేవలం రూ.2 మాత్రమే

Date:

దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో హర్యానా రాష్ట్రంలోని రోహ్‌తక్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆ అభ్యర్థి ఆస్తి కేవలం రూ.2 మాత్రమేనని ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో తెలిపారు. ఈ స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న మాస్టర్ రణ్‌ధీర్ సింగ్.. అత్యల్ప ఆదాయం కలిగిన ఎంపీ అభ్యర్థిగా నిలిచారు. ప్రస్తుతం ఆరో విడత ఎన్నికలకు సంబంధించి ఇటీవలె అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ ఆరో విడత పోలింగ్ ఈ నెల 25 వ తేదీన జరగనుంది. ఈ ఆరో దశలో మొత్తం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న 57 స్థానాలకు 869 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ మేరకు ఈ ఆరో విడతలో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్‌-ఏడీఆర్ వెల్లడించింది.

ఈ ఆరో విడత ఎన్నికల్లో పోటీ చేస్తున్న మొత్తం 869 మంది అభ్యర్థుల్లో 39 శాతం అంటే 338 మంది కోటీశ్వరులేనని ఏడీఆర్ తెలిపింది. ఒక్కో అభ్యర్థి ఆస్తుల విలువ సగటున రూ.6.21 కోట్లుగా ఉందని వారి అఫిడవిట్ల ఆధారంగా నివేదిక వెలువరించింది. ఇక ఈ దశలో పోటీ చేస్తున్న వారిలో అత్యధిక ఆస్తులు కలిగి ఉంది మాత్రం.. హర్యానాలోని కురుక్షేత్ర నుంచి బీజేపీ పార్టీ తరఫున బరిలోకి దిగుతున్న నవీన్‌ జిందాల్‌దేనని తెలిపింది. నవీన్ జిందాల్‌కు రూ.1241 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆ తర్వాత బిజూ జనతా దళ్‌కు చెందిన సంతృప్త్‌ మిశ్రా రూ.428 కోట్లు.. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సుశీల్‌ గుప్తా రూ.169 కోట్ల ఆస్తులతో రెండు, మూడో స్థానాల్లో నిలిచారు. రోహ్‌తక్‌ స్వతంత్ర అభ్యర్థి మాస్టర్ రణ్‌ధీర్ సింగ్ అత్యల్పంగా కేవలం రూ.2 విలువైన ఆస్తులను ప్రకటించగా.. ఆయన కంటే ముందు ప్రతాప్‌గఢ్‌లోని ఎస్‌యూసీఐ(సీ) అభ్యర్థి రామ్‌కుమార్ యాదవ్ తనకు రూ.1,686 విలువైన ఆస్తులు ఉన్నాయని చెప్పారు.