ఇకపై చార్ ధామ్ యాత్రలోని ఆలయాల ప్రాంగణంలోని 50 మీటర్ల పరిధిలో వీడియోలు, రీళ్ల చిత్రీకరణపై నిషేధం ఉంటుందని ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాధా రాటూరి తెలిపారు. ఆలయ ప్రాంగణంలో రీల్స్ చేయడం భక్తులకు ఇబ్బందిగా మారిందని, వారి మత విశ్వాసాలను దెబ్బతీస్తోందని రాధా రాటూరి వ్యాఖ్యానించారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా సినిమా పాటలకు నృత్యాలు చేస్తున్న ఉదంతాలు అనేకం వెలుగులోకి వస్తున్నాయని ఆమె అన్నారు. డెహ్రాడూన్లో చార్ధామ్ యాత్ర ఏర్పాట్లను పరిశీలించిన ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి పలువురు భక్తుల కోరికమేరకు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆమె తెలిపారు.
ప్రస్తుతం కొనసాగుతున్న చార్ ధామ్ యాత్రకు దేశ, విదేశాల నుంచి 26 లక్షల మంది భక్తులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. హరిద్వార్, రిషికేశ్లకు గతేడాదికంటే ఈసారి రెట్టింపు సంఖ్యలో భక్తులు వస్తున్నారని కమిషనర్ వినయ్శంకర్ పాండే తెలిపారు. మే 10న కేదార్నాథ్ ధామ్ తలుపులు తెరిచినప్పటినుంచి లక్ష మందికి పైగా భక్తులు దర్శనం చేసుకున్నారు. ఇప్పటివరకు దాదాపు 3 లక్షల మంది భక్తులు చార్ ధామ్ను సందర్శించారు. కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రితో సహా మూడు ధామ్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ఈ యాత్ర యమునోత్రి నుంచి మొదలై గంగోత్రి, కేదార్నాథ్ మీదుగా సాగుతూ బద్రీనాథ్ వద్ద ముగుస్తుంది.