ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్ వాంగ్మూలంలో సంచలన ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడికి పాల్పడిన ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఆమె నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు బిభవ్ను నిందితుడిగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. అతడు తనపై విచక్షణారహితంగా భౌతిక దాడికి పాల్పడ్డాడని, సున్నితమైన శరీర భాగాలపై పలుమార్లు కొట్టాడని ఆప్ ఎంపీ ఆరోపించినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో తెలిపారు.
ఢిల్లీ పోలీసు బృందం గురువారం మాలీవాల్ ఇంటికి వెళ్లి ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంది. ఈ సందర్భంగా దాడి ఘటనను ఎంపీ పోలీసులకు వివరించారు. ”సీఎం నివాసంలో కూర్చున్న నా వద్దకు బిభవ్ వచ్చి దాడికి దిగాడు. 7-8 సార్లు చెంపపై కొట్టాడు. ఛాతి, కడుపుపై కాలితో తన్నాడు. ఏం జరుగుతుందో అర్థం కాక నేను షాక్కు గురయ్యా. సాయం కోసం అరిచా. నన్ను నేను రక్షించుకునేందుకు అతడిని నా కాళ్లతో బలంగా తోసేశా. పరిగెడుతుంటే నా చొక్క పట్టుకుని వెనక్కి లాగాడు. సున్నితమైన శరీర భాగాలపై పలుమార్లు కొట్టాడు. పొత్తి కడుపులో విపరీతమైన నొప్పితో నడవలేకపోయా. ఎలాగో తన నుంచి తప్పించుకుని బయటకు వచ్చి పోలీసులకు ఫోన్ చేశా” అని స్వాతి వెల్లడించినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.