Wednesday, October 2, 2024
Homeక్రైంఅన్నదమ్ముల ప్రాణాలు తీసిన భూవివాదం

అన్నదమ్ముల ప్రాణాలు తీసిన భూవివాదం

Date:

ఇంటి రహదారి విషయంలో జరిగిన భూ తగాదాల గొడవ కారణంగా ఓ కుటుంబంలో విషాదం నింపింది. ఇద్దరు అన్నదమ్ముల కుమారులు మృతి చెందడంతో జగిత్యాల జిల్లా గోపులాపూర్‌ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఎస్ఐ శ్రీధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బుగ్గారం మండలం గోపులాపూర్‌కు చెందిన దివిటి శ్రీనివాస్ రెండేళ్ల క్రితం తన ఇంటి పక్కనే మరో ఇంటిని కొనుగోలు చేశాడు. దాని పక్కనే అదే గ్రామానికి చెందిన బుర్రా నవీన్ ఇల్లు కూడా ఉంది. దీంతో ఇంటి రహదారి విషయంలో నవీన్‌, శ్రీనివాస్‌కు తరచూ గొడవలు జరుగుతున్నాయి. గురువారం రాత్రి శ్రీనివాస్, నవీన్ కుటుంబాల మధ్య చిన్నపాటి గొడవ జరిగి సద్దుమణిగింది.

అనంతరం శ్రీనివాస్ తన పెదనాన్న కుమారుడు మహేష్ ఇంటికి వెళ్లాడు. ఇద్దరు మాట్లాడుకుంటుండగా.. నవీన్ కొంతమంది యువకులను తీసుకొచ్చి.. శ్రీనివాస్‌పై దాడి చేశాడు. ఈ ఘటనలో శ్రీనివాస్(36) అక్కడికక్కడే మృతి చెందాడు. అడ్డువచ్చిన మహేష్‌పై కూడా దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. అతడిని వరంగల్‌లోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మహేష్‌కు కుమారుడు, భార్య ఉన్నారు. శ్రీనివాస్ సోదరి మమత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. సంఘటన స్థలాన్ని అదనపు ఎస్పీ వినోద్ కుమార్ పరిశీలించారు.