దేశంలో అస్థిరతను సృష్టించేందుకు ఇండియా కూటమి ఎన్నికల బరిలో ఉందని విపక్ష ఇండియా కూటమిపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరోసారి విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామమందిరం అంశాన్ని ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీపై ఘాటు విమర్శలు చేశారు. వారు అధికారంలోకి వస్తే రామమందిరంపైకి బుల్డోజర్లను పంపిస్తారని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్లోని బారాబంకీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. శ్రీరామనవమి రోజున రామమందిరంపై ఎస్పీకి చెందిన ఓ సీనియర్ నేత అనుచిత వ్యాఖ్యలు చేశారు. మరోవైపు అయోధ్యపై సుప్రీంతీర్పును మార్చాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ రెండు పార్టీలకు కుటుంబం, అధికారమే ప్రథమ ప్రాధాన్యం. ఒకవేళ ఎస్పీ-కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వారు రామమందిరంపైకి బుల్డోజర్లను పంపి రామ్లల్లాను మళ్లీ టెంట్లోకి తీసుకొస్తారు అని మోడీ దుయ్యబట్టారు.
ఓ వైపు బిజెపి-ఎన్డీయే కూటమి జాతి ప్రయోజనాలకు జీవితాలను అంకితం చేస్తే.. ఇండియా కూటమి మాత్రం దేశంలో అస్థిర పరిస్థితులను సృష్టించేందుకు పోటీపడుతోంది. ఈ ఎన్నికల తర్వాత వారి కూటమి పేకమేడలా కూలిపోతుంది. జూన్ 4 ఎంతో దూరంలో లేదు. ఈ ఎన్నికల్లో మోడీ ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టబోతోందని ప్రపంచమంతా తెలుసు అని విజయంపై ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అమేఠీలో ఆయన పోటీ చేసే సాహసం చేయరని తాను ముందే ఊహించానని, ఇప్పుడు అదే నిజమైందని ఎద్దేవా చేశారు.