దేశంలో బిజెపి పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే మోడీ సర్కార్ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటుందని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కాషాయ పార్టీ 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అన్నారు. అంతేకాకుండా.. బాబా విశ్వనాథ ఆలయాన్ని నిర్మిస్తామని కూడా చెప్పారు. దిల్లీలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న బిశ్వశర్మ ఈ వ్యాఖ్యలు చేశారు.
”డబుల్, ట్రిపుల్ సెంచరీలు ఎందుకు చేశారని సచిన్ తెందూల్కర్ను అడిగితే ఈ ప్రశ్నకు సమాధానం ఉండదు. అదేవిధంగా గత లోక్సభ ఎన్నికల్లో 300 సీట్లతో గెలుపొందిన భాజపా.. అయోధ్యలో రాముడి ఆలయాన్ని నిర్మించింది. ఈ ఎన్నికల్లో ఒకవేళ 400 సీట్లు సొంతం చేసుకుంటే శ్రీ కృష్ణుడి జన్మస్థలం మథురలో దేవాలయాన్ని, వారణాసిలో బాబా విశ్వనాథ ఆలయాన్ని నిర్మిస్తుంది. దీంతో పాటు పీవోకేను భారత్లో విలీనం చేసేందుకు కృషి చేస్తుంది” అని హిమంత బిశ్వశర్మ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హయాంలో పీవోకే అంశంపై పార్లమెంట్లో ఎలాంటి చర్చ జరగలేదని ఆ పార్టీపై హిమంత విమర్శలు గుప్పించారు.