స్పామ్ కాల్స్ను నియంత్రించేందుకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ ఇప్పటికే అనేక రకాల చర్యలు తీసుకుంటోంది. తాజాగా వీటికి చెక్ పెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. త్వరలో కొత్త మార్గదర్శకాలు జారీ చేయనుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్, టెలికాం నియంత్రణ సంస్థ ఇలాంటి కాల్స్ నియంత్రణ కోసం మార్గదర్శకాలు రూపొందించింది. రిజిస్టర్ కానీ మొబైల్ నంబర్లు, అన్వాంటెండ్ కాల్స్ నియంత్రణకు ఇందులో పరిష్కారాలను ప్రతిపాదించింది. సాధారణంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, రియల్ ఎస్టేట్ సంస్థల నుంచి అధికంగా వస్తుంటాయి. ఇలాంటి కాల్స్ నుంచి ప్రయోజనం పొందుతున్న కంపెనీలే వీటికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ట్రాయ్ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే టెలికాం సంస్థలు జరిమానాలూ ఎదుర్కోవాల్సి ఉంటుంది.
టెలికాం కంపెనీలు కాల్స్ను గుర్తించడానికి వీలుగా వాటి ఐడెంటిటీని వెల్లడించాల్సి ఉంటుంది. ఇందుకు మూడు వేర్వేరు సిరీస్లను తీసుకురానున్నారు. మార్కెటింగ్ కాల్స్కు 140, సర్వీస్ కాల్స్ కోసం 160, ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా కమ్యూనికేషన్ కోసం 111 ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. టెలికాం ఆపరేటర్లు ప్రతీ కాలర్ పేరు, సెక్టార్తో సహా బహిర్గతం చేయాల్సిఉంటుంది. దీంతో వినియోగదారులు వారికి వచ్చే కాల్స్ను తిరస్కరించాలా? వద్దా? అని వారే నిర్ణయించుకోవచ్చు. వినియోగదారుల వ్యవహారాల శాఖ టెలికాం సంస్థలతో గత వారంలో చర్చలు జరిపిన తర్వాత ఈ మార్గదర్శకాలు రూపొందించిందని సమాచారం.