దేశంలో రాజ్యాంగాన్ని పూర్తిగా తొలగించాలనే ప్రయత్నం జరుగుతోందని కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ ఆరోపించారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో పేదలను ఆదుకునే పథకాలేవీ ఉండవని చెప్పారు. రైతుల, నిరుపేదలు, మహిళల కోసం ఆ ప్రభుత్వం ఏమీ చేయదన్నారు. ఉత్తరప్రదేశ్లో గ్యాస్ సిలిండర్ రూ.1200 ఉందని, తెలంగాణలో రూ.500కే ఇస్తున్నామని గుర్తు చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరులో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ప్రియాంక ప్రసంగించారు.
బిజెపి పాలనలో పేదలపై వేసే పన్నులు నిరంతరం పెరుగుతూనే ఉంటాయి. పేద రైతులు రూ.50 వేలు, రూ.లక్ష రుణాలు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారికి రుణమాఫీ చేసేందుకు భాజపా సర్కార్ అంగీకరించదు. కానీ, బడా వ్యాపారులకు మాత్రం భాజపా సర్కార్ రూ.16 లక్షల కోట్లు మాఫీ చేసింది. కీలకమైన సంస్థలను తమ చెప్పుచేతల్లో పెట్టుకొని ఆడిస్తోంది. ప్రజలు ఎలా బతుకుతున్నారో తెలుసుకునే ప్రయత్నాన్ని మోదీ ఎప్పుడూ చేయరు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం వచ్చి ధర్మం అనే నినాదం ఎత్తుకుంటారు. ప్రజల మధ్య మతం చిచ్చు పెట్టి ఓట్లు వేయించుకుంటారని ఆరోపించారు.