దేశంలో రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమేనని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. పోలవరం పూర్తి, రాజధాని నిర్మాణం సహా అన్ని సమస్యలకూ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పరిష్కారం లభిస్తుందని చెప్పారు. కులమతాలకు అతీతంగా అందరినీ అక్కునే చేర్చుకునే పార్టీ తమదన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడలోని కృష్ణలంక రాణిగారితోటలో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. వాషింగ్టన్ డీసీని మించిన రాజధానిని కడతానని చెప్పిన జగన్.. కట్టారా? అని నిలదీశారు. వైకాపా పాలనతో రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని.. పరిశ్రమలు రాలేదన్నారు. ఈ పరిస్థితులతో యువతకు ఉద్యోగాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. అభివృద్ధి విషయంలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. మాయమాటలతో కాకుండా మంచి చేసేవాళ్లకు ప్రజలు ఓట్లేయాలని షర్మిల పిలుపునిచ్చారు.