పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా గత ఐదేళ్లలో తన ఆదాయం, అప్పులు, చెల్లించిన పన్నుల వివరాలు వెల్లడించారు. ఐదేళ్లలో ఆయన సంపాదన రూ.114,76,78,300. ఇందుకు ఆదాయపన్నుగా రూ.47,07,32,875, జీఎస్టీ కింద రూ.26,84,70,000 చెల్లించినట్టు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. పవన్ అప్పులు రూ.64,26,84,453గా ప్రకటించారు. ఇందులో వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు రూ.17,56,84,453, వ్యక్తుల నుంచి తీసుకున్నవి రూ.46.70 కోట్లు అని వివరించారు.
విరాళాలు రూ.20కోట్లు పైనే..
వివిధ సంస్థలు, జనసేన పార్టీ నిర్వహించిన సేవా కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల కోసం రూ.17,15,00,000 విరాళం అందించినట్టు తెలిపారు. పార్టీ చేపట్టిన కౌలు రైతు భరోసా, జనసేన క్రియాశీలక కార్యకర్తల ప్రమాద బీమా లాంటి కార్యక్రమాల కోసం వేర్వేరు సందర్భాల్లో విరాళాలు అందజేసినట్టు వివరించారు. వివిధ సంస్థలకు రూ.3,32,11,717ల విరాళాలు అందజేశారు. కేంద్రీయ సైనిక్ బోర్డుకు రూ.కోటి, పీఎం సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఫండ్కు రూ.కోటి, ఏపీ సీఎం సహాయ నిధికి రూ.50లక్షలు, తెలంగాణ సీఎం సహాయ నిధికి రూ.50లక్షలు, శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్కు రూ.రూ.30,11,717, పవన్ కల్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్స్ లెన్స్కు రూ.2 లక్షలు విరాళం ఇచ్చినట్టు పేర్కొన్నారు.