సీఎం జగన్ ఉత్తరాంధ్రకు ఏం చేశాడో చెప్పాలని టిడిపి అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. స్థానిక ఎమ్మెల్యే అవినీతిపరుడు.. ఆమదాలవలసను పూర్తిగా ఊడ్చేశాడు. నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా ఆ ఇంట్లో వారికి కానుకలు సమర్పించాలి. నాగావళి, వంశధార ఇసుక విశాఖపట్నం వెళ్తోంది. ఇలాంటి వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు. నా దృష్టిలో పడ్డవారిని నేనంత ఈజీగా వదిలిపెట్టను. రూ.10 ఇచ్చి వందరూపాయలు దోచుకునే వ్యక్తి జగన్.
గుంటూరుకు చెందిన లక్ష్మి అనే మహిళ వైకాపా అరాచకాలను దేశం దృష్టికి తీసుకురావాలని ఢిల్లీ వెళ్లి బొటనవేలు కట్ చేసుకునే పరిస్థితి వచ్చింది. జగన్ లాంటి వ్యక్తి సీఎంగా ఉంటే మహిళలకు రక్షణ ఉంటుందా?చిరంజీవి, రాజమౌళి లాంటి వారిని కూడా జగన్ అవమానించారు. జగన్ ఒక విధ్వంసకారి. రూ.13లక్షల కోట్లు అప్పు చేశారు. దేశంలో ఎక్కువ అప్పులు ఉండే రాష్ట్రం ఏపీనే. అప్పులు ఎక్కువ ఉన్న రైతులు కూడా మన రాష్ట్రంలోనే ఉన్నారు. మేం అధికారంలోకి రాగానే పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాం, పంటల బీమా అమలు చేస్తాం. ప్రతి ఎకరాకు నీరిస్తాం. వ్యవసాయ రంగంలో సాంకేతికతను తీసుకువస్తాం. అధికారంలోకి వచ్చిన వెంటనే చెత్తపన్ను రద్దు చేస్తాం” అని చంద్రబాబు హామీ ఇచ్చారు.