ఢిల్లీ లిక్కర్ విధానంపై సీబీఐ నమోదు చేసిన కేసులో కవిత బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్కు కవిత అర్హురాలని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆమెను అరెస్టు చేశారని అన్నారు. ఈడీ కస్టడీలో ఉన్న ఆమెను సీబీఐ ఎందుకు అరెస్టు చేసిందన్నారు. ఆమెను అరెస్టు చేయాల్సిన అవసరం లేకున్నా అరెస్టు చేశారని కోర్టుకు వివరించారు. బిఆర్ఎస్ పార్టీకి కవిత స్టార్ క్యాంపెయినర్ అనీ, ఏడేళ్ల లోపు శిక్షపడే కేసులకు అరెస్టు అవసరం లేదని చెప్పారు.
ఈ కేసు దర్యాప్తును కవిత ప్రభావితం చేయగలరని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. లిక్కర్ కేసులో ఆమె కీలక వ్యక్తిగా ఉన్నారని చెప్పారు. ఆమెకు బెయిల్ ఇవ్వొద్దని కోరారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం మే 2న తుది ఉత్తర్వులు ఇస్తామని తెలిపింది. మరోవైపు ఢిల్లీ మద్యం విధానంలోని ఈడీ కేసులోనూ కవిత బెయిల్ పిటిషన్పై రౌస్ అవెన్యూ న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది.