తెలంగాణ లోక్ సభ ఎన్నికల విధులకు హాజరుకాని సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నట్టు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ హెచ్చరించారు. ఎన్నికల్లో పాల్గొనేందుకు 23వేల మంది సిబ్బందిని శిక్షణకు ఎంపిక చేస్తే 1700 మంది గైర్హాజరయ్యారని మండిపడ్డారు. వారిలో అనారోగ్యంతో బాధపడేవారు, గర్భిణిలను మినహాయించి మిగిలిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలోని హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్తో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. ఈనెల 18 నుంచి 25వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్టు చెప్పారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని వివరించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉంటే కచ్చితంగా పత్రికల్లో ప్రచురించాలని సూచించారు. గతేడాది జిల్లాలో 45 శాతం మాత్రమే ఓటింగ్ అయిందని, ఈసారి అవగాహన కార్యక్రమాలతో మరో 10శాతం పెంచేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు.