దేశంలో లోక్సభ ఎన్నికల రెండోవిడత పోలింగ్ ఏప్రిల్ 26న జరగనుంది. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 89 స్థానాలకు ఆ రోజున ఓటింగ్ జరగనుంది. ఇందులో మొత్తం 1,210 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిలో పలువురు సంపన్నులు ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫామ్స్ నివేదిక వెల్లడించింది. కర్ణాటకలోని మండ్య స్థానంలో మాజీ సీఎం కుమారస్వామిపై పోటీ చేస్తున్న కాంగ్రెస్ నేత వెంకటరమణ గౌడ రెండోవిడత పోలింగ్లో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తుల విలువ రూ.622 కోట్లకు పైనే. ఇక కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేశ్ రూ.593 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు.
అలనాటి బాలీవుడ్ నటి, మథుర సిట్టింగ్ ఎంపీ హేమమాలిని మూడో స్థానంలో నిలిచారు. ఈ ఎన్నికల్లో బిజెపి తరఫున మరోసారి ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆమె ఆస్తుల విలువ రూ.278 కోట్లు అని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. రెండో విడతలో మొత్తం 33శాతం అంటే 390 మంది కోటీశ్వరులు ఉన్నట్లు తెలిపింది. అభ్యర్థుల సగటు ఆస్తుల విలువ రూ.5.17 కోట్లుగా ఉంది. సార్వత్రిక పోలింగ్ సమరం మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఏప్రిల్ 19న తొలివిడత ఓటింగ్ జరగనుంది. తొలివిడతలో మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ కుమారుడు, ఎంపీ నకుల్నాథ్ రూ.717 కోట్లతో అత్యంత సంపన్న అభ్యర్థిగా నిలిచిన సంగతి తెలిసిందే. జూన్ 1వ తేదీ వరకు మొత్తం ఏడు విడతల్లో లోక్సభ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తుండగా జూన్ 4న ఫలితాలను వెల్లడించనున్నారు.