దేశంలోని అన్ని ప్రయోజనాలను పారిశ్రామికవేత్త అదానీకే ప్రధాని నరేంద్ర మోడీ కట్టబెడుతున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. తాను ఈ విషయం పార్లమెంట్ వేదికగా చెబితే తన సభ్యత్వాన్ని తీసివేశారని, సుప్రీంకోర్టు జోక్యంతో తాను తిరిగి ఎంపీ పదవి చేపట్టానని రాహుల్ అన్నారు. రాజస్ధాన్లోని జోథ్పూర్లో గురువారం జరిగిన ఎన్నికల ప్రచారసభలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ, కాషాయ పార్టీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ప్రతి పరిశ్రమలో అదానీయే ఎందుకు కనిపిస్తున్నారని తాను అడిగానని, అదానీతో మీకెలాంటి సంబంధం ఉందని ప్రధానిని ప్రశ్నించానని చెప్పారు. కాషాయ పాలకులు ప్రతిగా తన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసి తన ఇంటిని లాగేసుకున్నారని పేర్కొన్నారు.
వారు నా ఇంటిని తీసుకుంటే నేను మౌనంగా ఉంటానని వారనుకున్నారని చెప్పారు. ఇంటి తాళాలను వారికి అప్పగించి మీ ఇల్లు నాకు అవసరం లేదని, నాకు దేశంలో కోట్లాది ఇండ్లున్నాయని, కోట్ల మంది ప్రజల హృదయాల్లో నివసిస్తానని వారికి చెప్పానని రాహుల్ వివరించారు. కొద్ది మంది బడా సంపన్న పారిశ్రామికవేత్తల బాగు కోసమే మోదీ పనిచేస్తున్నారని విమర్శించారు.