ఎండలు మండుతున్నాయి.. సూరీడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఎండ వేడిమిని తట్టుకునేందుకు మద్యం ప్రియులు బీర్లు కొనుగోలు చేసేందుకే మొగ్గుచూపుతున్నారు. దీంతో బీర్లకు భారీగా డిమాండ్ పెరిగిందని వైన్స్, బార్ల నిర్వహకులు చెబుతున్నారు. ప్రతీ వేసవిలో సాధారణంగానే బీర్లకు డిమాండ్ ఉంటుంది.. లిక్కర్కు బదులు మద్యం ప్రియులు చల్లటి బీరుల వైపు మొగ్గు చూపుతుంటారు.. ఈ సారి కూడా అదే పరిస్థితి.. కాకపోతే.. డిమాండ్కు తగినట్టుగా సరఫరా లేక ఇబ్బందులు తప్పడంలేదని తెలుస్తోంది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతిరోజూ 60 వేల నుంచి 80 వేల కేసులకు పైగా బీర్లు అమ్ముడవుతున్నట్లు తెలుస్తోంది. వేసవిలో అదనంగా మరో 20 వేల కేస్లకు డిమాండ్ ఉందని అంటున్నారు. ప్రతీ రోజూ వైన్ షాపుల నుంచి వంద కేసుల బీర్ల కోసం ఆర్డర్లు వస్తుంటే.. 60 వేల నుంచి 80 వేల వరకు మాత్రమే వైన్ షాపులకు బీర్లు చేరుతున్నాయి. ఏప్రిల్లోనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో.. క్రమంగా బీర్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. వైన్ షాపులకు, బార్లకు వెళ్తున్న మద్యం ప్రియులు.. కూల్గా బీర్లు ఆర్డర్ చేస్తున్నారు. అయితే, సాయంత్రం, రాత్రి సమయం వచ్చేసరికి బీర్లు స్టాక్ లేకుండా అయిపోతుందని వైన్ షాపు నిర్వాహకులు చెబుతున్నారు.
ఇప్పుడు గ్రేటర్లోనే కాదు.. తెలంగాణ వ్యాప్తంగా బీర్లకు డిమాండ్ పెరుగుతోంది.. బీర్ కంపెనీల నుంచి ప్రస్తుతం రోజుకు లక్షన్నర నుంచి 2 లక్షల కేసుల వరకు అందుతున్నట్టు ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ లక్షన్నర నుంచి 2 లక్షల కేస్లు బీర్లు లాంగిచేస్తున్నారు. దీనిలో మెజార్టీ వాటా గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలదేనని గణాంకాలు చెబుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఇప్పుడు మరింత పెరిగింది.. ఏప్రిల్ 2023లో గ్రేటర్లో దాదాపు 12 లక్షల కేస్లకుపైగా బీరుల అమ్మకాలు జరిగితే.. ఇప్పుడు 15 లక్షల కేసులకు పైగా డిమాండ్ ఉంటుందట.. బీరు కేసుల విషయానికొస్తే, మే 2023లో 64 లక్షల కేసులు అమ్ముడయ్యాయి.. తెలంగాణలో ప్రతి నెలా 28 నుంచి 30 లక్షల కేసుల బీర్లు అమ్మకాలు సాగించారు. ఈ ఏడాది వీటి సంఖ్య భారీ స్థాయిలో పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.