దేశం అట్టుడుకుతుందంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోడీ ఖండించారు. అసలు అదేం భాష అని విమర్శించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రపుర్లో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. మూడోసారి బిజెపి అధికారంలోకి వస్తే.. దేశం అట్టుడికిపోతుందని కాంగ్రెస్ యువరాజు వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని 70 ఏళ్లు పాలించిన ఆ పార్టీ పదేళ్ల కిందట అధికారాన్ని కోల్పోయింది. వారు ఇప్పుడు ఇలాంటి మాటలు అంటున్నారు. వాటిని మీరు అంగీకరిస్తారా..? అలాంటి భాష ఆమోదయోగ్యమా..? అవి ప్రజాస్వామ్యయుతమైన మాటలేనా..?” అని మోడీ తీవ్రంగా స్పందించారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో.. ఆదివారం ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో జరిగిన ప్రతిపక్ష ‘ఇండియా బ్లాక్’ లోక్తంత్ర బచావో ర్యాలీలో రాహుల్ ప్రసంగించారు. ”ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నాయి. అంపైర్లపై ఒత్తిడి చేసి.. ఆటగాళ్లను కొనుగోలు చేసి.. కెప్టెన్లను బెదిరించి మ్యాచ్లు గెలవవచ్చు. దీనిని క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ అంటారు. మన ఎదుట లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. అంపైర్లను ప్రధాని మోదీ ఎన్నుకొన్నారు. మ్యాచ్కు ముందే మా జట్టులోని ఇద్దరు ఆటగాళ్లను అరెస్టు చేశారు. ఈవీఎంలు, మ్యాచ్ ఫిక్సింగ్, సోషల్ మీడియా, పత్రికలపై ఒత్తిడి లేకుండా వారు 180కి మించి స్థానాలు గెలవడం అసాధ్యం. ఈ ఫిక్సింగ్ ఎన్నికల్లో భాజపా గెలిచి, రాజ్యాంగాన్ని మారిస్తే.. ఈ దేశం మొత్తం అట్టుడుకుతుంది. గుర్తుంచుకోండి” అని బిజెపిపై రాహుల్ విమర్శలు చేశారు.