ఇద్దరు భార్యాభర్తలు ఇండియన్ ఆర్మీలో ఆఫీసర్లుగా పని చేస్తున్నారు. ఇప్పుడు వారు ఇద్దరు గణతంత్ర దినోత్సవ వేడుకల్లోని కర్తవ్య పథ్ వద్ద నిర్వహించే పరేడ్లో వేర్వేరు కాంటిజెంట్స్లో నాయకత్వం వహించనున్నారు. ఇలా భార్యాభర్తలిద్దరూ రిపబ్లిక్ డే వేడుకల పరేడ్లో పాల్గొనడం ఇండియన్ ఆర్మీలో ఇదే తొలిసారి. మేజర్ జెర్రీ బ్లెయిజ్.. మద్రాస్ రెజిమెంట్లో మిలటరీ పోలీసుగా విధులు నిర్వర్తిస్తున్నారు. కెప్టెన్ సుప్రీత సీటీ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్లో పని చేస్తున్నారు. అయితే వీరిద్దరూ 2023, జూన్లో వివాహం చేసుకున్నారు. ఇద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ, రిపబ్లిక్ డే పరేడ్లో ఇద్దరూ కలిసి పాల్గొనబోతున్నారు.
ఈ సందర్భంగా కెప్టెన్ సుప్రీత మాట్లాడుతూ.. ఎన్సీసీ డేస్ నుంచి జెర్రీ తనకు తెలుసన్నారు. తాను కూడా జెర్రీకి అప్పుడే పరిచయం అయ్యానని చెప్పారు. అయితే రిపబ్లిక్ పరేడ్లో పాల్గొనాలని అప్పట్లోనే కలలు కనేవాళ్లం. ఇప్పుడు ఆ కల నెరవేరబోతుందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. పరేడ్లో భాగంగా వేర్వేరు కాంటిజెంట్లలో తాము పాల్గొనడం గొప్ప అనుభూతిని ఇస్తుందన్నారు. రిపబ్లిక్ డే పరేడ్లో తామిద్దరం కలిసి పాల్గొంటామని ఊహించుకోలేదు. కానీ యాధృచ్చికంగా అవకాశం కలిసి వచ్చిందన్నారు సుప్రీత.
మేజర్ జెర్రీ బ్లెయిజ్ మాట్లాడుతూ.. తన భార్య సుప్రీత ఎన్సీసీ కాంటిజెంట్లో భాగంగా 2016లో గణతంత్ర దినోత్సవ పరేడ్లో పాల్గొన్నదని గుర్తు చేశారు. తనకేమో 2014లో అవకాశం వచ్చిందన్నారు. ఇప్పుడేమో ఇద్దరం ఒకేసారి పరేడ్లో పాల్గొనబోతున్నాం. ఈ క్షణం ఎంతో సంతోషాన్నిస్తుందన్నారు. ఇక తమ రెజిమెంట్కు తానే నాయకత్వం వహిస్తున్నానని చెప్పారు. ఇది గొప్పగా ఉందన్నారు. మొత్తానికి తన కోరిక తీరిందన్నారు.