ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ గత వారం రోజులుగా తరచుగా వాంతి చేసుకుంటోన్న సద్గురుకు స్కానింగ్ నిర్వహించగా.. బ్రెయిన్లో కొంత తేడాను వైద్యులు గమనించారు. ఈ నెల 17న ఢిల్లీ అపొలో ఆస్పత్రికి తరలించగా.. ఆయనకు బ్రెయిన్ సర్జరీని విజయవంతంగా చేసినట్టు తెలిసింది. సద్గురు జగ్గీ వాసుదేవ్ ప్రస్తుత వయస్సు 66 సంవత్సరాలు. మార్చి 17న ఢిల్లీ అపొలో ఆస్పత్రికి తీసుకొచ్చిన సమయంలో ప్రాథమిక పరీక్షలు నిర్వహించగా.. బ్రెయిన్లో స్వెల్లింగ్ వచ్చినట్టు గుర్తించారు. అలాగే కొంత మేర బ్లీడింగ్ను గుర్తించారు. ఢిల్లీ అపొలో ఆస్పత్రిలో డాక్టర్ వినీత్ సురీ నేతృత్వంలోని బృందం ఎమ్మారై పరీక్షలు నిర్వహించగా బ్లీడింగ్ ఎక్కువగా కనిపించినట్టు తెలిసింది.
పరిస్థితి విషమించకుండా ఉండాలంటే తక్షణం శస్త్రచికిత్స అవసరమని గుర్తించిన డాక్టర్లు.. వెంటనే ఆపరేషన్ నిర్వహించినట్టు తెలిసింది. వైద్యబృందంలో డాక్టర్ వినీత్ సూరితో పాటు డాక్టర్ ప్రణవ్ కుమార్, డాక్టర్ సుధీర్ త్యాగి, డాక్టర్ ఎస్ ఛటర్జీ ఉన్నారు. ఆపరేషన్ తర్వాత సద్గురుకు సంబంధించిన అన్ని హెల్త్ పారామీటర్లు మెరుగవుతున్నట్టు తెలిసింది. దీనిపై ఢిల్లీ అపొలో నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. 1983లో మైసూరులో మొదటి యోగా క్లాస్ను నిర్వహించాడు. 1989 లో కోయంబత్తూర్ లో ఈశా యోగ సెంటర్ ఏర్పాటు చేశాడు. కోయంబత్తూరు నుండి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న వెళ్ళంగిరి పర్వత పాదాల చెంత పదమూడు ఎకరాల భూమిలో ఈ సెంటర్ నడుస్తోంది. 1999లో సద్గురు ఆశ్రమ ప్రాంగణంలో ధ్యానలింగం ఏర్పాటు చేశారు. ఏ ప్రత్యేక మతానికీ, విశ్వాసానికీ చెందని ధ్యానలింగ యోగాలయం ధ్యానానికి మాత్రమే నిర్దేశించామని, కాంక్రీటు, స్టీలు ఉపయోగించకుండా ఇటుకరాళ్ళూ, సున్నంలతో 76 అడుగుల గోపురం, గర్భగుడిని నిర్మించామని సద్గురు చెబుతారు. హిందూ, ఇస్లాం, క్రైస్తవ, జైన్, టావో, జొరాష్ట్రియన్, జుడాయిజం, షింటో, బౌధ్ధ మతాల గుర్తులతో, అన్ని మతాల ఏకత్వాన్ని చాటుతూ ఓ సర్వధర్మ స్థంభాన్ని ఏర్పాటు చేశారు