Wednesday, September 25, 2024
HomeUncategorizedబిజెపి కండువా కప్పుకున్న తమిళిసై

బిజెపి కండువా కప్పుకున్న తమిళిసై

Date:

తెలంగాణ రాష్ట్ర మాజీ గవర్నర్ తమిళిసై సుందరరాజన్ బుధవారం చెన్నైలో బిజెపి పార్టీలో చేరారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమక్షంలో తమిళిసై పార్టీలో చేరారు. ఆమె మెడలో కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నేతలు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమె రాజీనామా చేశారు. ప్రజాసేవ చేసేందుకు తాను స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్లు తమిళిసై వెల్లడించారు. నిజాయితీ రాజకీయాలు చేసేందుకు తిరిగి రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆమె తెలిపారు.

తమిళిసై.. గతంలో తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా కూడా పని చేశారు. రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉండేవారు. 2011, 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పరాజయం పాలయ్యారు. ఇక 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే నాయకురాలు కనిమొళి చేతిలో తమిళిసై ఓడిపోయారు. గత ఏడాది నుంచి తమిళిసై తిరిగి రాజకీయాల్లోకి వస్తున్నారని వార్తలు వినిపించాయి. మొత్తానికి గవర్నర్ పదవికి రాజీనామా చేసి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. తెలంగాణలో తమిళిసై పదవీకాలం మరో ఆరు నెలలు, పుదుచ్చేరిలో మరో రెండేళ్లు ఉంది.

ఇదిలా ఉంటే బీజేపీ మూడో జాబితా త్వరలో విడుదలకానుంది. తొలి విడతలోనే తమిళనాడు ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. బుధవారమే తొలి నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఫస్ట్ ఫేజ్‌లోనే తమిళనాడు ఎన్నికలు ఉండడంతో తమిళిసై పేరు మూడో జాబితాలో ఉండనుంది. ట్యూటికోరిన్ నియోజకవర్గం నుంచే తమిళిసై మళ్లీ పోటీ చేయొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.