మొబైల్ నంబర్ పోర్టబిలిటీ విషయంలో ట్రాయ్ కొత్త నిబంధన తీసుకొచ్చింది. సిమ్ కార్డ్ స్వాప్ లేదా రీప్లేస్ చేసిన ఏడు రోజుల వరకు వేరే నెట్వర్క్కు మారడాన్ని నిలిపివేసింది. సిమ్ స్వాప్ మోసాలను అరికట్టేందుకు గానూ ట్రాయ్ ఈ నిర్ణయం తీసుకుంది. జులై 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
సిమ్ పేరుతో జరిగే మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో వీటికి చెక్ పెట్టాలంటూ టెలికాం విభాగం రాసింది. దీంతో ట్రాయ్ కొత్త మార్పు చేపట్టింది. ఈ కొత్త నిబంధనతో కూడిన సర్క్యులర్ను గత వారం జారీ చేసింది. దీని ప్రకారం.. ఎవరైనా వ్యక్తి సిమ్ కార్డు మార్చుకున్నా, స్వాప్ చేసినా వారం రోజుల వరకు వేరే నెట్వర్క్కు మారేందుకు అవసరం అయ్యే యునిక్ పోర్టింగ్ కోడ్ను (UPC) జారీ చేయరు. కొత్త వ్యక్తి పేరుతో అదే నంబర్ను తీసుకోకుండా కేటుగాళ్లను నిలువరించే ఉద్దశంతో ఈ నిబంధన తీసుకొచ్చినట్లు ట్రాయ్ తెలిపింది.
సాధారణంగా సిమ్ కార్డు పోతేనో లేదా పాడైతేనో సంబంధిత టెలికాం సంస్థను ఆశ్రయిస్తే.. కొత్త సిమ్ కార్డును జారీ చేస్తుంటాయి. వేరే నెట్వర్క్కు మారాలాంటే ప్రస్తుత మొబైల్ నంబర్ నుంచి PORTను 1900కు ఎస్సెమ్మెస్ పంపించాల్సి ఉంటుంది. దీంతో మీకో యునిక్ కోడ్ వస్తుంది. ఇతర నెట్వర్క్కు మారేటప్పుడు ఈ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. 2009లో తొలిసారి పోర్టబిలిటీ విధానం అమల్లోకి వచ్చింది.