సంక్షేమ ప్రభుత్వంలో ఓ తరగతి పౌరుల పరిశుభ్రత అనేది మరో వర్గం వారిని బానిసత్వంలో నిమగ్నం చేయడం ద్వారా సాధించలేమని పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించిన ఓ కేసులో బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈసందర్భంగా 580 మంది మున్సిపల్ కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించి, వారికి అన్ని ప్రయోజనాలు కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ముంబయి మున్సిపల్ విభాగంలో సుదీర్ఘకాలంగా పనిచేస్తోన్న 580 మంది తాత్కాలిక పారిశుద్ధ్య కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా పరిగణించాలని కోరుతూ అక్కడి వర్కర్స్ యూనియన్ ట్రైబ్యునల్ను ఆశ్రయించాయి. రోడ్లను ఊడ్చటం, చెత్త సేకరణ వంటి పనులు నిర్వర్తించే వీరికి శాశ్వత పోస్టులు సృష్టించాలంటూ ఇండస్ట్రియల్ ట్రైబ్యునల్ గతంలో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబయి హైకోర్టులో సవాలు చేసింది.
విచారించిన జస్టిస్ మిలింద్ జాధవ్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం.. ‘స్వచ్ఛమైన వాతావరణనేది పౌరుల ప్రాథమిక హక్కు. కానీ కార్మికుల మానవ గౌరవాన్ని కాలరాయడం ద్వారా దాన్ని సాధించలేం. సంక్షేమ ప్రభుత్వంలో ఒక తరగతి పరిశుభ్రత అనేది మరో వర్గాన్ని బానిసత్వంలో నిమగ్నం చేయడం ద్వారా సాధించలేం’ అని పేర్కొంటూ తీర్పు చెప్పింది. ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును కొట్టివేయడమనేది ‘న్యాయాన్ని అపహాస్యం’ చేసినట్లే అవుతుందని అభిప్రాయపడింది. నవంబర్ 2023లో ఇచ్చిన ఈ తీర్పు తాజాగా అందుబాటులోకి వచ్చింది.