రాబోయే రోజుల్లో ఈ రంగంలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుందని, దేశ భవిష్యత్తు అవసరాలు, ప్రాధాన్యాలను గుర్తించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ప్రధాని మోడీ విమర్శించారు. అందువల్లే దేశంలో సెమీకండక్టర్ తయారీ పరిశ్రమలు నెలకొల్పడంలో జాప్యం జరిగిందన్నారు. బుధవారం రూ.1.25 లక్షల కోట్లు విలువైన సెమీకండక్టర్ ప్లాంట్లకు ఆయన వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఇందులోభాగంగా గుజరాత్లో రెండు, అస్సాంలో ఒకటి ఏర్పాటుకానున్నాయి.
తొలిసారిగా 1960లో సెమీ కండక్టర్ల తయారీ కోసం భారత్ కలలు కన్నది. అప్పటినుంచి దేశాన్ని పాలించిన ప్రభుత్వాలు వాటి ప్రాధాన్యాన్ని గుర్తించలేకపోయాయి. భవిష్యత్తు అవసరాలకు తగినట్లు పెట్టుబడులు పెట్టలేకపోవడంతో ఈ రంగంలో భారత్ చాలా వెనకబడింది. కానీ, మా ప్రభుత్వం అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా సెమీకండక్టర్ల తయారీకి సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు మాత్రమే వీటిని తయారుచేస్తున్నాయి. 21వ శతాబ్దం సాంకేతికత ఆధారంగా పనిచేస్తుంది. ఎలక్ట్రానిక్ చిప్ లేని గ్యాడ్జెట్స్ను ఊహించడం కష్టం. మేడిన్ ఇన్ ఇండియా, డిజైన్ ఇన్ ఇండియా చిప్ ఎంతో దూరంలో లేదు. ఇతరులపై ఆధారపడకుండా భారత్ స్వయంసమృద్ధిగా ఎదగడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది” అని ప్రధాని తెలిపారు.
బిజెపి అధికారంలోకి వచ్చాక.. రక్షణ, బీమా, టెలికాం రంగంలో ఎఫ్డీఐలను ఆకర్షించేందుకు సరళతరమైన విధివిధానాలు రూపొందించినట్లు ప్రధాని తెలిపారు. ప్రస్తుతం మొబైల్ తయారీలో భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశంగా నిలిచేందుకు ఇవి ఎంతో దోహదం చేశాయన్నారు. సెమీ కండక్టర్ పరిశ్రమల ద్వారా దేశ యువత అధికంగా లబ్ధి పొందుతారని తెలిపారు. ఏఐ మిషన్లో భాగంగా సరికొత్త ఆవిష్కరణల కోసం భారత్ పనిచేస్తోందని, సాంకేతిక అభివృద్ధితోపాటు దాన్ని అమలుచేయడంపైనా కేంద్రం దృష్టి సారించిందన్నారు.