ఎన్నికల బాండ్ల రూపంలో దేశంలోని పలువురు రాజకీయ పార్టీలకు ఇచ్చిన విరాళాల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేసింది. ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో భారతీయ స్టేట్ బ్యాంకు దిగివచ్చింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల ప్రకారం.. మార్చి 15 సాయంత్రం 5గంటల్లోగా ఎన్నికల సంఘం కూడా ఈ సమాచారాన్ని వెబ్సైట్లో అందుబాటులో ఉంచాల్సి ఉంది.
ఎన్నికల బాండ్ల వివరాలను ప్రకటించేందుకు జూన్ 30 వరకు అదనపు సమయం ఇవ్వాలంటూ ఎస్బీఐ దాఖలు చేసిన పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం మార్చి 11న విచారించింది. ఈ సందర్భంగా ఎస్బీఐ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తంచేసిన న్యాయస్థానం.. సమాచారం అందుబాటులో ఉన్నా ఎన్నికల సంఘానికి సమర్పించకపోవడాన్ని తప్పుబడుతూ బ్యాంకు అభ్యర్థనను కొట్టివేసింది. మార్చి 12న బ్యాంకు పనివేళలు ముగిసేలోపు మొత్తం వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించాల్సిందేనని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎస్బీఐ మంగళవారం సాయంత్రం ఎన్నికల బాండ్ల వివరాలను ఈసీకి అందజేసింది.