Monday, September 23, 2024
HomeUncategorizedదేశంలోనే అతి పొడవైన రైలు సొరంగం ప్రారంభం

దేశంలోనే అతి పొడవైన రైలు సొరంగం ప్రారంభం

Date:

దేశంలోనే అతి పొడవైన రైలు సొరంగం మార్గాన్ని జమ్మూ-కశ్మీర్‌లో ఉధంపుర్- శ్రీనగర్- బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బనిహాల్- ఖడీ- సుంబడ్‌- సంగల్‌దాన్‌ సెక్షన్‌ (48.1 కి.మీ.)ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ప్రారంభించారు. ఈ మార్గంలోనే ఖడీ- సుంబడ్‌ల మధ్య ‘టీ-50’ సొరంగం వస్తుంది. బారాముల్లా- శ్రీనగర్‌- సంగల్‌దాన్‌ మార్గంలో రెండు విద్యుత్‌ రైళ్లకూ జమ్మూ నుంచి వర్చువల్‌గా పచ్చజెండా ఊపారు. కశ్మీర్‌ లోయలో ఎలక్ట్రిక్‌ రైళ్లను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి.

‘టీ-50’ సొరంగం పొడవు 12.77 కి.మీ. బనిహాల్- సంగల్‌దాన్‌ సెక్షన్‌లోని 11 సొరంగాల్లో ఇదే అత్యంత సవాల్‌గా నిలిచిందని అధికారులు తెలిపారు. యూపీఏ హయాంలో 2010లో పనులు ప్రారంభమయ్యాయి. దాదాపు 14 ఏళ్లకు అందుబాటులోకి వచ్చింది. సొరంగం లోపల అన్ని భద్రతా చర్యలు తీసుకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులను సురక్షితంగా తరలించేందుకు ‘టీ-50’కి సమాంతరంగా ఒక ఎస్కేప్ టన్నెల్ నిర్మించారు. ప్రతీ 375 మీటర్ల దూరంలో ఈ రెండింటినీ కలుపుతూ మార్గాలు (క్రాస్‌ పాసేజ్‌) ఏర్పాటుచేశారు.

యూఎస్‌బీఆర్‌ఎల్‌ ప్రాజెక్టును రూ.41 వేల కోట్లతో చేపట్టారు. మొత్తం పొడవు 272 కి.మీ. బారాముల్లా- సంగల్‌దాన్‌, ఉధంపుర్‌- కాట్రా సెక్షన్‌ల మధ్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. కాట్రా- సంగల్‌దాన్‌ల మధ్య 63 కిలోమీటర్ల మేర పనులు సాగుతున్నాయి. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి ‘చీనాబ్‌ వంతెన’, దేశంలో తొలి తీగల రైలు వంతెన ‘అంజీఖాడ్‌’ ఈ మార్గంలోనే ఉన్నాయి. తాజాగా బనిహాల్- సంగల్‌దాన్‌ సెక్షన్‌ ప్రారంభంతో కశ్మీర్ లోయ నుంచి కన్యాకుమారి వరకు రైలు నడపాలనే లక్ష్యానికి మరింత చేరువైనట్లు అధికారులు తెలిపారు.