దేశంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో యూపీలో తమ మద్దతు కావాలంటే తమ ఆఫర్ను అంగీకరించాలని సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి షరతు పెట్టింది. తొలుత ఎస్పీ 11 సీట్లనే కేటాయించినా.. కాంగ్రెస్ డిమాండ్తో ఆ సంఖ్యను 17కి పెంచింది. కాగా.. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా హస్తం పార్టీ 52 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. యూపీలోని అమేఠీ, రాయ్బరేలీ స్థానాలు కాంగ్రెస్ కుటుంబానికి కంచుకోటలు. దీంతో ఎస్పీ ఈ రెండు స్థానాలకు దూరంగా ఉంది. అయితే, అమేఠీలో రాహుల్ గాంధీ.. బిజెపి నేత స్మృతిఇరానీ చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దాంతో ఒక్క రాయ్బరేలీని గెలుచుకున్న కాంగ్రెస్.. యూపీలోని 80 ఎంపీ స్థానాలకు గానూ ఒక్క సీటుకే పరిమితమైంది.
ఒకవేళ పొత్తు కుదిరినా, ఇతర స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయలేదని తెలుస్తోంది. ఎస్పీ ఇచ్చిన ఆఫర్పై హస్తం పార్టీ స్పందించాల్సి ఉంది. రాహుల్గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ పాల్గొనడం ఆ పార్టీ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉన్నట్లు తెలుస్తోంది. యాత్రలో అఖిలేశ్ పాల్గొంటారని హస్తం పార్టీ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ ఆశాభావం వ్యక్తంచేశారు. కూటమిలో సీట్ల కేటాయింపుపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పశ్చిమబెంగాల్లో టీఎంసీ ఒంటరిగా పోటీ చేస్తానని ప్రకటించింది. ఢిల్లీలో కాంగ్రెస్కు ఆప్ ఒక్క సీటు మాత్రమే ఆఫర్ చేసింది. మరోవైపు జమ్మూకశ్మీర్లో ఫరూక్ అబ్దుల్లా.. పంజాబ్లో ఆప్ ఒంటరిగానే పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. కాషాయ పార్టీతో జట్టు కట్టే అవకాశాలున్నట్లు ఆర్ఎల్డీ హింట్ ఇచ్చింది.